మృతదేహాల మధ్యే మృత్యుపోరాటం! | fighting between dead bodies | Sakshi
Sakshi News home page

మృతదేహాల మధ్యే మృత్యుపోరాటం!

Jan 12 2014 4:00 AM | Updated on Sep 2 2017 2:31 AM

అది నిత్యం జనసంచారం కలిగిన కల్వర్టు. రెండు రోజుల క్రితం ఓ ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు కల్వర్టు కింద పడిపోయింది.

 మందమర్రి, న్యూస్‌లైన్: అది నిత్యం జనసంచారం కలిగిన కల్వర్టు. రెండు రోజుల క్రితం ఓ ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు కల్వర్టు కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆ మృతదేహాల మధ్యే మృత్యుపోరాటం చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కుందారం శ్రీనివాస్, అతని భార్య శ్రీలత, కుమారడు అజయ్‌రావు, కుమార్తె దీక్షిత గురువారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని తమ బంధువుల తల్లి దిశదిన కర్మకు వెళ్లారు. అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వారు స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.
 
  మందమర్రి శివారులోని కల్వర్టు పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ విషయం రెండురోజులుగా నుంచి బాహ్య ప్రపంచానికి తెలియలేదు. అయితే, శనివారం ఉదయం తాము ప్రమాదంలో ఉన్నామని మాత్రమే శ్రీలత సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మందమర్రి, రామకృష్ణాపూర్ గ్రామాల మధ్య ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ప్రాంతాల్లో గాలించారు. ఈ గ్రామాల మధ్య గల పాకిస్తాన్ క్యాంపు పక్కనే ఉన్న కల్వర్టు కింద శ్రీనివాస్(35), దీక్షిత (4) మృతదేహాలు కనిపించాయి. పక్కనే శ్రీలత, కుమారుడు అజయ్‌రామ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిని 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement