మున్సిపోల్స్‌కు సర్వం సన్నద్ధం | Everything is ready for municipal elections | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌కు సర్వం సన్నద్ధం

Mar 6 2014 11:58 PM | Updated on Sep 2 2017 4:25 AM

మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు.

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. గురువారం రాష్ర్ట ఎన్నికల కమిషన్ రమాకాంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపట్టినఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయని, 145 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడానికి 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రమాకాంత్‌రెడ్డికి కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రాలను కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలను ఈనెల 7న మరోసారి ప్రకటిస్తామని, పోలీసు సిబ్బంది నియామకంపై ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ఓటరు స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల జోనల్ బాధ్యతను గెజిటెడ్ అధికారులకే ఇస్తున్నామనీ, వీరికి మెజిస్ట్రీయల్ అధికారాలు కూడా కల్పించామని కలెక్టర్ వెల్లడించారు.  ఎన్నికల నియమావళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, ఈ బృందాలు ఇప్పటికే వివిధ పార్టీల హోర్డింగ్‌లు, బ్యానర్లు, వాల్‌రైటింగ్‌లు తొలగిస్తున్నాయన్నారు. బెల్ట్ షాప్‌లు మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్పీ శెముషీ, డీఆర్‌ఓ దయానంద్‌తోపాటు మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement