విద్యా వ్యవస్థకు విషమ పరీక్షే | education system loss for the students | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థకు విషమ పరీక్షే

Aug 30 2013 4:23 AM | Updated on Aug 27 2018 9:19 PM

మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాలోని విద్యార్థుల శ్రేయస్సు కాంక్షించి నెల్లూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో అరకొర కోర్సులతో విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు.

 నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాలోని విద్యార్థుల శ్రేయస్సు కాంక్షించి నెల్లూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో అరకొర కోర్సులతో విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు. వైఎస్సార్ అకస్మిక మరణంతో యూనివర్సిటీకి భవన నిర్మాణాలు కూడా చేపట్టలేదు. యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసే సౌత్‌జోన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సైతం రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఉంది. జిల్లాలో బీటెక్, ఎంసీ, ఎంబీఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు కచ్చితంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు దక్కించుకుని స్థిరపడుతున్నారు.
 
 జిల్లాలో ప్రస్తుతం 34 వేల మంది విద్యార్థులు డిగ్రీ, 15 వేల మంది బీటెక్, 10 వేల మంది పీజీ చదువుతున్నారు. వీరుగాక మెడికల్, ఫార్మసీ విద్యార్థులు మరో 5 వేల మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 36 వేల  మంది ఉన్నారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత వీరికి ఉపాధి అవకాశాలు జిల్లాలో లేవు. ఇంత వరకూ హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.
 
 రాష్ట్ర విభజనతో సీమాంధ్రులు నాన్‌లోకల్ కిందే లెక్క. దీంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుంది. వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు విడుదలయ్యే నిధుల్లో 10 శాతం కూడా సీమాంధ్రలోని 14 యూనివర్సిటీలన్నిటిని కలిపినా రావు. జేఎన్‌టీయూ, ఉస్మానియా, ఐఐటీ, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ప్రఖ్యాతిగాంచిన నిమ్స్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇవికాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇన్ఫోసిస్, విప్రో, వాసవి, సీబీఐటీ సంస్థలు హైదరాబాద్‌లో ఉండడంతో విభజనతో జిల్లా విద్యార్థులు పక్క రాష్ట్రానికి వెళ్లినట్టవుతుంది. విద్యార్థుల ఉన్నత విద్య అధ్యయనానికి అవసరమైన సీసీఎంబీ, జియోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇక్రిశాట్, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌లను ఆశ్రయిస్తున్నారు. విభజనతో ఈ అవకాశం చేజారిపోతుందని నిపుణులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్మా ఇండస్ట్రీలైన రెడ్డి ల్యాబ్స్, అరబిందో తదితర కంపెనీలు హైదరాబాద్‌లో ఉండడంతో ఈ రంగానికి చెందిన విద్యార్థులు ఇప్పటి వరకు శిక్షణ, ఉద్యోగాల కోసం అవలీలగా వెళ్లగలుగుతున్నారు. ఐటీ సంబంధిత హెటెక్ సిటీతో జిల్లా విద్యార్థులు పూర్తిగా సంబంధాలు కోల్పోతారు.
 
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మెదక్ ఐఐటీ, హైదరాబాద్ ఐఐఐటీలలో జిల్లా విద్యార్థులకు అవకాశమే లేకుండా పోతుంది. రాష్ట్ర వ్యవసాయ పరిశోధన స్థానం పక్క రాష్ట్రంలో ఉండడంతో ఇక్కడి వ్యవసాయ విద్యార్థులకు అవసరమైన సమాచారం తెలుసుకోవాలంటే ఇబ్బందు లు ఎదుర్కోవలసి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం నర్స రీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 1,70,000 మంది విద్యార్థుల భవిష్యత్‌పైనే రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావం చూపనుంది. పాలకులు, అధికారులు ఐదు దశాబ్దాల పాటు కృషి చేసి హైదరాబాద్‌లో ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ  ఏర్పాటు చేయగలిగారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఇలాంటి యూనివర్సిటీలు నెలకొల్పాలంటే మరో 50 ఏళ్లకు పైగానే సమ యం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
 పభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో ప్రస్తుతం రూ.1,05 లక్ష ఫీజు వసూలు చేస్తున్నా అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలలు సైతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన తర్వాత ఆయా కళాశాలల్లో చదవాలంటే లక్షలు వెచ్చించినా సీటు దొరికేది కష్టమవుతుంది. జేఎన్‌టీయూకు అనుబంధంగా ఏర్పడిన కాకినాడ ప్రాంతీయ జేఎన్‌టీయూ ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. సీమాంధ్ర లో ప్రత్యేకంగా వర్సిటీలు ఏర్పరచినా అవి అభివృద్ధి చెంది సత్ఫలితాలు అందించేందుకు కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. జిల్లాలో అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి అవకాశాలకు పోటీ పెరిగి గుమస్తా ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సిన పరిస్థితి.
 
 సెంట్రల్ యూనివర్సిటీలన్నీ అక్కడే ఉన్నాయి
 అన్ని వనరులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీలను మరో 50 ఏళ్లకు కూడా మనం ఏర్పాటు చేసుకోలేం. విభజన జరిగితే సీమాంధ్రలో నిరుద్యోగం పెరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది.    - ఎం.వేణుగోపాల్‌రెడ్డి, వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ కన్వీనర్
 
 
 విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు గురవుతారు
 గ్రామీణ, మారుమూల ప్రాంత విద్యార్థులు సైతం చదువు పూర్తయ్యాక హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాన్వేషణ చేస్తారు. విభజన జరిగితే సీమాంధ్ర విద్యార్థులకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. తెలంగాణ వేర్పాటు వాదులు సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులపైనే దాడులకు తెగబడుతున్నారు. విభజన జరిగితే ఇక్కడి విద్యార్థులను హైదరాబాద్‌లో కాలు కూడా పెట్టనివ్వరు. జిల్లాలో ఉద్యోగాలు లేక అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కు వెళ్లలేక విద్యార్థులు భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి విద్యార్థుల్లో నైరాశ్యం నెలకొంది. నిరాశ నిస్పృహలతో మనోవేదనకు గురవుతున్నారు.
 - జయవర్ధన్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు              
                     
 
 ప్యాకేజీలను నమ్మలేం..
 పదేళ్ల క్రితం విభజన జరిగిన రాష్ట్రాలకు ఇంత వరకు ప్యాకేజీ నిధులు  ఇవ్వలేదు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రం కల్లబొల్లి మాటలు చెబుతోంది. ప్యాకేజీలను నమ్ముకొని హైదరాబాద్‌ను వదులుకునేంత అవివేకం మరొకటి లేదు. సీమాంధ్ర విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లి పరాయి రాష్ట్రంలో దౌర్భాగ్యమైన జీవనం గడపాల్సి వస్తుంది. అయినా తెలంగాణ వేర్పాటు వాదులు సీమాంధ్రులను అక్కడ ఉండనిచ్చే పరిస్థితిలేదు. ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసేవాళ్లు ప్రత్యేక రాజధానిని నిర్మించుకోవాలి.  
 - కె.తిరుమలనాయుడు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement