ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం | EAMCET counseling start | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

Aug 8 2014 3:42 AM | Updated on Sep 18 2018 7:45 PM

ఎంసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్ పక్రియ గురువారం ప్రారంభమైంది. నెల్లూరులోని దర్గామిట్ట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో ఈ పక్రియను చేపట్టారు.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎంసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్ పక్రియ గురువారం ప్రారంభమైంది. నెల్లూరులోని దర్గామిట్ట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో ఈ పక్రియను చేపట్టారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూసిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల్లో ముగ్గురు అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో 18 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు.
 
  1వ ర్యాంకు నుంచి 5వేల ర్యాంకు వరకు చేపట్టిన ఈ పరిశీలన కార్యక్రమంలో రెండు కేంద్రాల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మందకొడిగా సాగిన తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలన పలు సందేహాలకు తావిస్తోంది. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారన్న అనుమానం కలుగుతోంది. యథావిధిగా ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ వెబ్‌సైట్ మొరాయించడంతో గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెద్ద ఇబ్బందిలేదని ప్రిన్సిపల్స్ నారాయణ, రామోహన్‌రావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
  పోలీసు బందోబస్తు, తాగునీటి వసతిని కల్పించామన్నారు. శుక్రవారం జరిగే వెబ్ కౌన్సెలింగ్ 5001 నుంచి 7,500 వరకు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, 7,501 నుంచి 10,000 వేల వరకు బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యర్థులు హాజరుకావాలని వారు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement