భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త చివరకు ఆమెను హత్య చేసేందుకు తెగబడ్డాడు. గొడ్డలితో కిరాతకంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఏ.పోలవరం (జంగారెడ్డిగూడెం రూరల్), న్యూస్లైన్ : భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త చివరకు ఆమెను హత్య చేసేందుకు తెగబడ్డాడు. గొడ్డలితో కిరాతకంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి గంగాజలాన్ని(27) ఆమె భర్త ధర్మయ్య అనుమానిస్తున్నా డు. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో వంట చేస్తున్న గంగాజలంపై అతను గొడ్డలితో దాడిచేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ధర్మయ్య పరారయ్యాడు. కొన్నాళ్లుగా ధర్మయ్య భార్యను అనుమానిస్తూ హింసిస్తున్నాడని గంగాజలం సోదరుడు సర్వేశ్వరరావు తెలిపాడు. నెల క్రితం భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వచ్చేసిందని, తాము నచ్చజెప్పి కాపురానికి పంపామని చెప్పాడు. గతంలో చాలాసార్లు ఇలానే జరిగిందని, సమస్యను పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ధర్మయ్య ప్రవర్తనలో మార్పురాలేదన్నాడు. గంగాజలంకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.