డబుల్ డెక్కర్.. | Double decker.. | Sakshi
Sakshi News home page

డబుల్ డెక్కర్..

May 15 2014 2:04 AM | Updated on Sep 2 2017 7:21 AM

రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. ఏసీ డబుల్ డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది.

కడప అర్బన్, న్యూస్‌లైన్: రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. ఏసీ డబుల్ డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. క డప రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 3.30  గంటలకు చేరుకుంది.
 
 ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఈ డబుల్  డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు (ప్రతి బుధ,శనివారం) జిల్లా మీదుగా తిరుపతికి వెళుతుంది. అలాగే ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడకు వెళుతుంది. తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు కడప చేరుకుని 3.22కు బయలుదేరుతుంది. తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు గురు, ఆదివారాల్లో ఉదయం 8.05 గంటలకు కడప చేరుకుని 8.07కు బయలుదేరుతుంది. ఈ రైలు జిల్లాలో ఎర్రగుంట్ల, కడప, రాజంపేట స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. బోగీలన్నీ ఏసీ కావడంతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ఇందులో ప్రయాణిస్తున్న వారు పేర్కొన్నారు.
 
 చార్జీలు ఇలా..
 కడప నుంచి రాజంపేట, రేణిగుంట, తిరుపతి వరకు రూ. 250 ఛార్జిగా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. కనీస ఛార్జి ఈ రైలులో రూ. 250గా నిర్ణయించారన్నారు. కడప నుంచి కాచిగూడకు రూ. 570 ఛార్జి ఉంటుందన్నారు. కడప నుంచి ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు రూ. 250 వసూలు చేస్తారన్నారు.
 
 కడప నుంచి గుత్తికి రూ. 260, డోన్‌కు రూ.310, కర్నూలుకు రూ. 355, గద్వాల్‌కు రూ. 410, మహబూబ్‌నగర్‌కు రూ.460, కాచిగూడకు రూ. 570 వసూలు చేస్తారన్నారు. కాచిగూడ నుంచి తిరుపతికి రూ. 655 ఛార్జీ వసూలు చేస్తారు. రిజర్వేషన్ ఛార్జితో కలిపి రూ.700గా నిర్ణయించారు. తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే రూ. 885 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ తప్పక చేయించుకోవాలి. జిల్లాలోని స్టేషన్లలో ప్రయాణించేటప్పుడు కరెంటు బుకింగ్‌లో రూ. 250 కనీస ఛార్జి ఉంటుంది. ఉదాహరణకు కడప నుంచి రాజంపేటకు, రేణిగుంట, తిరుపతికి రూ. 250 ఉంటుంది. ఎర్రగుంట్ల నుంచి కడపకు కూడా రూ. 250 చెల్లించాల్సిందే.
 
 చాలా సౌకర్యవంతంగా ఉంది
 డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా ఉంది. పగటిపూట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా గమ్య స్థానానికి చేరుకోవచ్చు. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది.
 - శ్రీదేవి, ప్రయాణికురాలు
 
 సంతోషంగా ఉంది
 సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా వేసవి కాలంలో ఏసీ బోగీల రైలు డబుల్ డెక్కర్‌లో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. మిగతా రైళ్లలోని ఎక్స్‌ప్రెస్‌లలో ఏర్పాటు చేసిన ఏసీ బోగీలతో సమానంగా అధునాతన సౌకర్యాలతో రూపొందించారు.
 - తుకారం, ప్రయాణికుడు
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement