టీడీపీ-బీజేపీలపై వస్తున్న విష ప్రచారాలు నమ్మొద్దని, రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
ఒంగోలు: టీడీపీ-బీజేపీలపై వస్తున్న విష ప్రచారాలు నమ్మొద్దని, రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ గోవధపై కొందరు పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను కబేళాలకు తరలించవద్దనేదే కేంద్ర ప్రభుత్వం విధానమని, పశు ఆహారం తినవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. గోవధపై వచ్చిన అభ్యంతరాలను కేంద్రం పరిశీలిస్తోందని వెంకయ్య అన్నారు.
కాగా ఏపీ రాష్ట్రానికి రూ.2.30 లక్షల కోట్ల నిధులతో కూడిన ప్యాకేజీ కేటాయించామని వెంకయ్య వెల్లడించారు. సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రకాశం జిల్లాలో రామయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు. శాశ్వతమైన అభివృద్ధి కావాలని, అంతేకానీ రంజాన్ తోఫా... సంక్రాంతి కానుకలు ప్రజలకు మేలు చేయవని, అటువంటివాటికి తాము వ్యతిరేకమన్నారు.