గుర్తింపులేని సేవ..!

Doctors Shortage In Vizianagaram - Sakshi

పేరుగొప్ప ఊరు దిబ్బ

కాంట్రాక్టు వైద్యుల దయనీయ స్థితి

అన్ని సేవలూ అందించాలి

గుర్తింపు ఉండదు.. అధికారాలూ ఉండవు..  

కిందిస్థాయి రెగ్యులర్‌ వైద్యులను ఆదేశించేందుకూ అవకాశం లేదు..

సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ సమ్మెబాట

ఆందోళన చెందుతున్న రోగులు, గర్భిణులు

వారు మెరుగైన వైద్యసేవలందిస్తారు..రోగులు, వారి కుటుంబ సభ్యులమెప్పు పొందుతారు.. మంచివైద్యులుగా గుర్తింపుపొందుతారు..అయితే, ప్రభుత్వం దృష్టిలో వారిసేవకు గుర్తింపు ఉండదు.. వారిసర్వీసు పరిగణలోకి రాదు.. పీజీఅర్హత పరీక్షలో వెయిటేజీ ఉండదు..ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సర్వీసుక్రమబద్ధీకరించరు. పీహెచ్‌సీలోకిందిస్థాయి రెగ్యులర్‌ సిబ్బందినీనియంత్రించలేని దయనీయపరిస్థితి.. పీహెచ్‌సీల్లో పనిచేసేకాంట్రాక్టు వైద్యులది. సర్వీసునుక్రమబద్ధీకరించాలంటూ సమ్మెబాటపట్టారు. అత్యవసర వైద్యసేవలకేపరిమితమవుతున్నారు. మొన్నటివరకు ఏ చిన్న అనారోగ్యం చేసినాఅందుబాటులో ఉండే వైద్యులు
ఇప్పుడు ఆస్పత్రిలో కనిపించకపోయేసరికి రోగులు, గర్భిణులుతల్లడిల్లుతున్నారు. ఆందోళనచెందుతున్నారు.

విజయనగరం, బలిజిపేట: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వైద్యులది పేరుగొప్ప ఊరుదిబ్బ అనే చందంగా మారింది. చెప్పుకునేందుకు వారు పీహెచ్‌సీకి మెడికల్‌ ఆఫీసర్లు.  అంతర్గతంగా చూస్తే వారికి ఎటువంటి అధికా రాలు లేవు.  డ్రాయింగ్‌ పవర్స్‌ లేవు. íపీహెచ్‌సీలను నియంత్రించలేరు. ఆస్పత్రిలో రెగ్యులర్‌ పోస్టులలో ఉండి విధులు నిర్వహించే వారికి పని చెప్పలేరు.  వారు ఏం చేస్తే దానికే సై అనాల్సిన పరిస్థితి. మండల స్థాయిలో వీరిని పట్టించుకునే అధికారులూ ఉండరు. పీహెచ్‌సీకి హాజరై సీట్లో కూర్చుని వారి నిర్ధిష్ట సమయంలో ఓపీ చూసుకుని వెళ్లిపోవడం, వైద్యశాఖ పరంగా ఉండే ఇతరత్రా కార్యక్రమాలనునిర్వహించడం మినహా మరే ప్రాధాన్యం లేదు. ఎంతకాలం పనిచేసినా గొర్రెతోక బెత్తెడు అనే చందంగా ఉండడంతో విసిగెత్తిన వీరు గళమెత్తారు. ఆరేళ్లు, ఆ పైబడి పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులను క్రమబద్ధీకరించాలంటూ సమ్మెకొనసాగిస్తున్నారు.

సేవలకు గుర్తింపు లేదు...
రెగ్యులర్‌ వైద్యులు పీజీ చేయడానికి సర్వీసును వెయిటేజీ ఇచ్చే ప్రభుత్వం...  కాంట్రాక్టు వైద్యులు పీజీ  చేసేందుకు రాసే పరీక్షలో సర్వీసుకు వెయిటేజీ ఇవ్వడం లేదు.  దీంతో వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.  ప్రాధాన్యంలేని ప్రాక్టీసు ఎందుకనేది వారి ప్రశ్న.

సమ్మె నిర్వహిస్తున్నారిలా..
ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విధులు బహిష్కరణ. 10 నుంచి 13వ తేదీ వరకు అత్యవసర సేవలకు మాత్రమే హాజరై మిగిలిన వాటికి గైర్హాజరుకావడం,  14వ తేదీ నుంచి కాంట్రాక్టు వైద్యులందరు సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించారు.

కాంట్రాక్టు వైద్యులు ఇంతవరకు అందించే సేవలు...
పీహెచ్‌సీలో కాంట్రాక్టు వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సేవలందించాలి.  మిగిలిన సమయంలో అత్యవసర సేవలకు పేషెంట్స్‌ వస్తే సిబ్బంది ఫోన్‌కాల్‌ చేస్తే సేవలందించాలి. 24 గంటలూ పీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యులుంటే ఒకరు ఓపీ చేసుకుంటే మరొకరు ఫీల్డ్‌ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. పీహెచ్‌సీలో ఓపీ, ఏంటినేటల్స్‌ చెకప్‌లు, ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు, ప్రధానమంత్రి మాతృ వందన యోజనాపథకం, ప్రతీ మంగళవారం హైరిస్క్‌ గర్భిణులకు పరీక్షలు, డీ–వార్మింగ్‌ డే, నేషనల్‌ లెప్రసీ రేడికేషన్‌ ప్రొగ్రాం, పల్స్‌పోలియో, పాఠశాలల పర్యవేక్షణ, వసతిగృహాల పర్యవేక్షణ, మిషన్‌ ఇంద్రధనుష్, జ్వరాలు ఎక్కువుగా ఉండేచోట ప్రత్యేక వైద్యశిబిరాల నిర్వహణ, వీటితో పాటు ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ల వీడియో, టెలీకాన్ఫెరెన్స్‌లలో పాల్గొనడం తదితర విధులు నిర్వర్తించాలి.

ఇబ్బందులు పడుతున్న రోగులు
కాంట్రాక్టు వైద్యులు సమ్మె కొనసాగిస్తుండడంతో పీహెచ్‌సీలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరల్‌ జ్వరాలు తీవ్రంగా ఉండడంతో వచ్చిన రోగులకు సాదాసీదాగా సేవలు అందుతున్నాయి.  గర్భిణులకు నెలవారీ వైద్యపరీక్షలకు అంతరాయం కలుగుతోంది. పీహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

వైద్యాధికారిణి లేక...
నా పేరు మౌనిక. నాది చిలకలపల్లి గ్రామం. నేను గర్భిణిని. ప్రస్తుతం నాకు 9వ నెల. ప్రతీ నెల బలిజిపేట పీహెచ్‌సీకి వచ్చి క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటున్నాను. అదే కోవలో ఇప్పుడు వ్యయప్రయాసలకోర్చి వస్తే వైద్యాధికారణి లేరు. తిరిగి వెళ్లిపోతున్నాను. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top