
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని ఏపీ ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కోడెల మృతిపై ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీకే చెందిన నేత మృతిని ఇలా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కోడెల మరణంపై చంద్రబాబు రాజకీయం చేయడం తగదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగానే కోడెల బలవన్మరణం పొందారని స్వయానా అతని మేనల్లుడే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని, కొద్ది రోజుల్లో వాస్తవాలు వెలువడతాయని ఆయన తెలిపారు.