విష జ్వరాలతో మేడ్చల్ నియోజక వర్గం మంచం పట్టింది. డె ంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి.
మేడ్చల్, శామీర్పేట్, న్యూస్లైన్: విష జ్వరాలతో మేడ్చల్ నియోజక వర్గం మంచం పట్టింది. డె ంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో వ్యాధులు విజృంభిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనం రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 వేల చొప్పున విడుదల చేస్తున్నట్లు అధికారులు గొప్పలు చెప్పారు గాని ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి రోగాలకు కారణమవుతోంది.
వణికిస్తున్న విషజ్వరాలు..
ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఏర్పడింది. మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో దోమలు, ఈగలు విజృంభించి జనం రోగాల బారినపడుతున్నారు. ఇటీవల లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి వాణి డెంగీ వ్యాధి సోకి మృత్యువాత పడింది. మండలంలోని కేశవరం గ్రామానికి చెందిన నలుగురు, తుర్కపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు, అనంతారానికి చెందిన ఇద్దరికి ఇటీవల డెంగీ వ్యాధి సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొంది వేలకు వేలు ఖర్చు పెట్టుకున్నారు. తాజాగా ఉప్పరిపల్లికి చెందిన చిన్నారి వెంకటేష్, అనిత దంపతుల చిన్నారి మౌనిక(6)కకు డెంగీ సోకి శనివారం మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బాబాగూడకు చెందిన ఓ చిన్నారి డెంగీ వ్యాధితో నగరంలోని నిలోఫర్లో చికిత్స పొందింది. గతేడాది మేడ్చల్ మండలంలో డెంగీ సోకి 20 మంది మృతిచెందారు.
నిమ్మకు నీరెత్తిన అధికారులు..
వర్షాకాలంలో ప్రజలకు పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, తాగునీటిపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేరు. జనం రోగాల బారినపడి చస్తున్నా కూడా పట్టించుకోరా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డెంగీ ఇలా వ్యాపిస్తోంది..
ఏడీస్ అనే దోమ కాటుతో డెంగీ వ్యాపిస్తుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఉండే దోమల వల్ల వ్యాధి వ్యాపిస్తుంది. డెంగీ తీవ్ర జ్వరంతో ప్రారంభమవుతుంది. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స చేయించుకోకుంటే ప్రాణాలను బలితీసుకుంటుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ వ్యాధి నాలుగు రకాలు. వాటిలో హిమారైజిక్ రకం ప్రాణాంతకమైంది. వ్యాధి వైరస్ మనిషి రక్త కణాలను తయారు చేసే కణాలను నాశనం చేసి మృత్యువుకు కారణమవుతుంది. డెంగీకి సంబంధించిన పరీక్షలు నగరంలోని నారాయణగూడలో ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్లో నిర్వహిస్తారు. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో కుట్టిన దోమలతో డెంగీ వ్యాపించే అవకాశం ఎక్కువ. ప్రజలకు సందేహాలు ఉంటే ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలి.
-డాక్టర్ పుష్ప, శామీర్పేట్ పీహెచ్సీ ఇన్చార్జి