ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ | Daddarillina meet expenses | Sakshi
Sakshi News home page

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

Jun 24 2014 2:17 AM | Updated on Sep 2 2017 9:16 AM

తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం పలు గ్రామాల ప్రజలు చేసిన ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. గుడ్లవల్లేరు మండలం చంద్రాల, మండవల్లి మండలం కొవ్వాడలంక,

కలెక్టరేట్ : తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం పలు గ్రామాల ప్రజలు చేసిన ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. గుడ్లవల్లేరు మండలం చంద్రాల, మండవల్లి మండలం కొవ్వాడలంక, ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామాల ప్రజలు వేరువేరు సమస్యల పరిష్కారంకోసం, ఉద్యోగభద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
 
తొలగింపు నిర్ణయాన్ని విరమించాలి

తమను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొంది స్తోందని, వాటిని ఉపసంహరించుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 2006 నుంచి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 169 మందిమి విధులు నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో ఉన్న తమను తొలగించేందుకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు.

తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంతో చర్చించాలని, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం నాయకులు రెడ్డి నాగేంద్రరావు, జి.శ్రీనివాసరావు, ఎ.భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
 
మౌలిక వసతులకోసం..
 
మౌలిక వసతుల కోసం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామస్తులు దళిత బహుజన పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. గ్రామంలో 90 శాతం మంది కూలి పనులు చేసుకునే వారిమేనని, 2006లో కొల్లేరు ఆపరేషన్ అనంతరం జీవనభృతి లేక అనేక కష్టాల పాలు పడుతూ జీవిస్తున్నామని పేర్కొన్నారు.

చేపల చెరువుల కారణంగా నీరు కలుషితమై తాగేందుకు చుక్కనీరు దొరకడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామంలో 210 మంది ఇళ్లస్థలాలు లేక రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని వివరించారు. అధికారులు తమ గ్రామాన్ని పరిశీలించి తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు కోన శ్రీనివాసరావు, కె.పోలయ్య, ఘంటసాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
 
ఇళ్ల పట్టాల కోసం..

ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామస్తులు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. గతంలో గ్రామస్తుల కోసం ఇళ్లస్థలాలు కేటాయించేం దుకు భూమి సేకరించారని పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించి పంచాయతీలో పేర్లను కూడా ప్రకటించారని తెలిపారు. అయితే ఈ జాబితాలో కొంత మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మరికొంత మందిని విస్మరించారని ఆరోపించారు. అర్హులు అందరికీ ఇళ్లపట్టాలు ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతరం కలెక్టర్ రఘునందనరావుకు వినతిపత్రం అందజేశారు.

చేపల చెరువుగా మార్చొద్దు..
 
తాగునీటి చెరువును చేపలచెరువుగా మార్చొద్దంటూ గుడ్లవల్లేరు మండలం చంద్రాలలో ప్రజలు ధర్నాచేశారు. గ్రామ తాగునీటి అవసరాల కోసం అడుసుమిల్లి రఘునాయకులు గతంలో మంచినీటి చెరువును విరాళంగా ఇచ్చారని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ చెరువును చేపలచెరువుగా మార్చేందుకు పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు కూడా చేసిందని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ రఘునందనరావుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో గ్రామస్తులు  కె.రాజేంద్రప్రసాద్, ఎ.శ్రీనివాస్, ఎన్.కుటుంబరావు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement