గింజగింజకూ అక్రమాలే.. | Custom milling rice against the special permit | Sakshi
Sakshi News home page

గింజగింజకూ అక్రమాలే..

Sep 6 2013 3:26 AM | Updated on Sep 1 2017 10:28 PM

కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల అక్రమాల్లో డొంక కదులుతోంది. అర్హులైన రైస్ మిల్లర్లతో సంబంధం లేకుండా ఇతరులకు బదిలీ అయిన ప్రత్యేక పర్మిట్ల బాధితులు 12 మంది కాదని, 31 మంది ఉన్నారని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు.

కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల అక్రమాల్లో డొంక కదులుతోంది. అర్హులైన రైస్ మిల్లర్లతో సంబంధం లేకుండా ఇతరులకు బదిలీ అయిన ప్రత్యేక పర్మిట్ల బాధితులు 12 మంది కాదని, 31 మంది ఉన్నారని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. మిలర్ల అంగీకారం లేకుండా రైస్‌మిలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడి సంతకంతో వచ్చిన దరఖాస్తులను జిల్లా సరఫరా అధికారి బదిలీ చేసిన కారణంగా 12 మంది మిల్లర్లు కలిపి ఏకంగా కోటి రూపాయలు నష్టపోయినట్లు చెబుతుండగా... ఇప్పుడు ఈ విలువ రెండున్నర కోట్లకు పైమాటే అని తెలుస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బాధితులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా బయటకు రాకుండా రైస్ మిలర్ల సంఘం బాధ్యులు వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. నష్టపోయిన వారు పేర్లు వెల్లడించి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పౌర సరఫరాల అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే ఫిర్యాదు చేసిన వారు వ్యాపారపరంగా భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని సంఘం ముఖ్యులు హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. రైస్‌మిలర్ల సంఘానికి, పౌర సరఫరాల అధికారులకు ఇప్పటికే పేర్లు తెలిసిన 12 మందిలో నలుగురు రైస్ మిల్లర్లు మాత్రం శుక్రవారం కరీనగర్‌కు వచ్చి జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
 
 పర్మిట్ల అక్రమ బదిలీలో తాము ఎక్కువగా నష్టపోయామని ఈ నలుగురిలో ఇద్దరు గురువారం పౌరసరఫరాల కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటామని అధికారులు షరతు పెట్టడంతో వీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే చూడాలని, ఒకవేళ వచ్చినా తదుపరి ఎలాంటి విచారణ, చర్యలు లేకుండా అన్ని రకాలుగా ప్రయత్నించాలని రైస్ మిల్లర్ల సంఘం ముఖ్యులు నిర్ణయించుకున్నారు. దీని కోసం రాజకీయపరంగా  తమ పలుకుబడిని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు.
 
 ధాన్యం కేటాయింపులోనూ...
 పర్మిట్ల బదిలీ ఒక్క విషయంలోనే కాకుండా ప్రభుత్వ ధాన్యం బియ్యంగా మార్చే(సీఎంఆర్) కేటాయింపుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని కొందరు రైస్ మిల్లర్లు చెబుతున్నారు. సంఘం ముఖ్యులతో ‘మంచిగా’ ఉన్న వారికే ప్రభుత్వ ధాన్యం కేటాయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలోనూ త్వరలోనే ఫిర్యాదుదారులు బయటికి వస్తారని చెబుతున్నారు.
 
 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కస్టమ్ మిల్లింగ్ బియ్యంలో వందశాతం అప్పగించిన వారికి అంతే పరిమాణంలో మార్కెట్‌లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్లు ఇవ్వాలి. జిల్లాలో 226మంది మాత్రమే వందశాతం బియ్యం అప్పగించడంతో వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రైస్‌మిల్లర్ల సంఘం పెత్తనం తో అధికారులు ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి మాత్రమే పర్మిట్లు ఇచ్చా రు. ఇందుకు రైస్‌మిలర్ల సంఘం అక్రమ దందా నే కారణంగా కనిపిస్తోంది.
 
 ఇప్పటివరకు ఇచ్చిన పర్మిట్లలోనూ 30 శాతం వరకు అర్హులకు సంబంధం లేకుండా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పౌర సరఫరాలశాఖ అధికారి ఆమోదంతోనే జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం వచ్చే ఫిర్యాదులతో అక్రమాల దం దా ఏ మేరకు ఉందనేది స్పష్టం కానుంది. కస్ట మ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల దందాపై ‘సాక్షి’లో వచ్చిన విస్తృత కథనంతో అధికారుల్లో చలనం మొదలైంది. ఇప్పటివరకు జారీ చేసిన 87 వేల టన్నుల బియ్యం పర్మిట్ల వివరాలను ఠీఠీఠీ.జ్చుటజీఝ్చజ్చట.జీఛి.జీ  వెబ్‌సైట్ లో పొందుపరిచామని, అక్రమాలు జరిగినట్లు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement