ఫైరింజన్‌తో నీళ్లు కొడితే అసెంబ్లీ గోడల లోపల నీటి ఊట!

CRDA checks on Rain water in the YS Jagan Chamber at Assembly - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చాంబర్‌లోకి వర్షపు నీరు చేరడంపై సీఆర్‌డీఏ తనిఖీలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తాత్కాలిక భవనాల డొల్లతనమేంటో అధికారుల పరిశీలనలోనే బయటపడింది. ఫైరింజన్‌ ఉపయోగించి అసెంబ్లీ తాత్కాలిక భవన గోడలపై బయట వైపు నుంచి నీళ్లు కొడితే భవనం లోపలవైపు గదుల్లో నీరు చేరడాన్ని అధికారులు గుర్తించారు. మంగళవారం చిన్నపాటి వర్షానికే.. అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్, ఇతర అధికారులు బుధవారం అగ్ని మాపక శకటంతో అసెంబ్లీ తాత్కాలిక భవనంలో తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలు జరిగే సమయంలోనూ, అనంతరం అసెంబ్లీ లోపలికి మీడియా రాకపోకలపై అసెంబ్లీ అధికారులు ఆంక్షలు విధించారు. తనిఖీల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించిన భద్రతాధికారులు అదే సమయంలో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లడానికి  గేటు వద్దే అడ్డుకున్నారు. అధికారులు జగన్‌ చాంబర్‌ వద్ద గోడ బయట వైపు నుంచి అగ్నిమాపక శకటం ద్వారా నీళ్లు కొట్టారు. కొద్దిసేపటికే గోడ లోపల వైపు నీటి ఊట రావడం పరిశీలనలో తేలినట్టు సమాచారం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top