పల్లె గొల్లుమంది | countryside | Sakshi
Sakshi News home page

పల్లె గొల్లుమంది

Feb 21 2015 2:28 AM | Updated on Sep 2 2017 9:38 PM

నవాబుపేట మండలం కూచురు గ్రామంలో చంద్రయ్య కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులను పోషిస్తున్నాడు. చంద్రయ్య భార్య దుర్గమ్మ కూడా కూలి పనులు చేసేది.

నవాబుపేట: నవాబుపేట మండలం కూచురు గ్రామంలో చంద్రయ్య కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులను పోషిస్తున్నాడు. చంద్రయ్య భార్య దుర్గమ్మ కూడా కూలి పనులు చేసేది. అయితే, ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. శుక్రవారం మధ్యాహ్నం భర్త చంద్రయ్య ఊళ్లోకి వెళ్లిన సమయంలో ఆమె కూడా గ్రామంలోకి వెళ్లి మద్యం తాగి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన చంద్రయ్య భార్యను మందలించి ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త మందలించాడన్న కారణంతో సాయంత్రం సాకలి దుర్గమ్మ (36) తన ఇద్దరు కొడుకులకు బలవంతంగా గుళికలు తాగించి.. తానూ తాగింది.
 
 బలవంతంగా గుళికలు తాగించడంతో ఇద్దరు పిల్లలు గట్టిగా ఏడ్చారు. దీంతో చుట్టుపక్కల వారు గ్రహించి గ్రామంలోకి వెళ్లిన చంద్రయ్యకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో చంద్రయ్య భార్యా పిల్లలను 108లో జిల్లాకేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పెద్ద కుమారుడు శివకుమార్ (10) మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గమ్మ (36), చిన్న కుమారుడు గణేశ్ (07)లు తనువు చాలించారు.
 
 మేమేం పాపం చేశాం...
 తల్లి ఏ పని చెప్పినా చేసే చిన్నారులు.. చివరకు ఆమె కర్కశత్వానికి బలైపోయారు. ఎప్పుడూ తమ క్షేమం గురించే ఆలోచించి.. తమ ఆకలి బాధను తీర్చే తల్లి తమ ప్రాణాలనే తీస్తుందనుకోలేదు. తల్లి ఏమిచ్చినా తమ మంచి కోసమేనని అనుకున్న ఆ చిన్నారులు ఆ విషాన్ని పెరుగన్నంలా తాగారు. గ్రామంలో అందరితో కలియదిరిగిన ఆ చిన్నారులు తల్లి మూర్కత్వంతో అనంతలోకాలకు చేరుకున్నారని గ్రామస్తులు కంటనీరు పెట్టుకున్నారు.
 
 మృతుల నేత్రాలు దానం
 ఆత్మహత్య చేసుకున్న తల్లి, ఇద్దరు కొడుకుల నేత్రాలను దానం చేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు వీరి కళ్లను బంధువుల అనుమతితో తీసుకున్నారు.
 కేసు నమోదు...ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మృతురాలి భర్త చంద్రయ్య ఫిర్యాదు మేరకు శువ్రారం నవాబుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లె కేసు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement