దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే సత్తా ప్రధాని నరేంద్రమోదీకే ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.
చింతలపూడి : దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే సత్తా ప్రధాని నరేంద్రమోదీకే ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ కన్వీనర్ తుల్లిమెల్లి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందని నమ్మి జన్ధన్, స్వచ్ఛభారత్ వంటి వినూత్న కార్యక్రమాలను మోదీ ప్రవేశపెట్టారన్నారు. అధికారం చేపట్టగానే ప్రజలకు అవసరం లేని 70 చట్టాలను రద్దు చేశారన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకాలను తీసుకునే విధానంతో పాటు, నోటరీ చేయించే పద్ధతిని మోదీ రద్దు చేశారని, ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలన్నారు.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కారణమని అన్నారు. సమావే శంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, నియోజకవర్గ కన్వీనర్ కుటుంబరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం పలువురు మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. సభలో పట్టణ బీజేపీ కన్వీనర్ కొనకళ్ల రాము, బీజేపీ రాష్ట్ర నాయకులు పీవీఎస్ వర్మ, రామ్మోహన్రావు, కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.త్వరలో ఆలయ కమిటీల భర్తీరాష్ట్రంలోని ఆలయ కమిటీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రగడవరంలోని శ్రీశ్రీశ్రీ విజయ శంకర బాల కనక దుర్గాదేవి శివ పంచాయతన క్షేత్రాన్ని సందర్శించారు. ద్వారకాతిరుమలలో సాంకేతిక విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.