
కౌన్సిల్లో తెలుగు తమ్ముళ్ల వాగ్వాదం
నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చకు కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు.మున్సిపాలిటీలో ఇంజినీరింగు,
బొబ్బిలి: నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చకు కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు.మున్సిపాలిటీలో ఇంజినీరింగు, కాంట్రాక్టర్ల మధ్య అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం అధికార పార్టీలో చిచ్చు రేపింది. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటూ వారి మధ్య ఉండే అంతరాలను మ రింత దూరం పెంచారు. ఈ నెలలో మున్సిపల్ డీఈతో కాంట్రాక్టరు దిబ్బ గోపీ వాగ్వాదానికి దిగారు. చేసిన పనులకు ఇంజినీరింగు అధికారులు చెల్లింపులు చేయడం లేదని, కొంత మంది కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసి వెంటనే బిల్లుల చెల్లింపులు చేస్తున్నారంటూ వాదనకు దిగారు. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి అధికార పార్టీ నాయకులు, పాలకులు రంగంలోకి దిగారు.
అయితే దీనికి శాశ్వత పరిష్కారం కోసం కౌన్సిల్ సభ్యులు వారి అభిప్రాయాలను చెప్పాలని, ఇప్పటివరకూ జరిగిన విషయాలను డీఈ రమేష బెహ రా వివరిస్తారని కౌన్సిల్లో చర్చకు మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి జీరో అవ ర్లో అవకాశం ఇచ్చారు. దాంతో డీఈ ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు. డీఈ కాంట్రాక్టర్ల కోటరీని నిర్వహించడం వల్ల మిగిలిన వారికి అవకాశాలు దొరకడం లేదని, దానివల్లనే వారంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు, ప్రజాప్రతి నిధులు, కాంట్రాక్టర్లకు వేర్వేరుగా సమయాలను కేటాయించాలని 7వ వార్డు కౌన్సిలరు రాంబార్కి శరత్ అన్నారు. దాంతో వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు. డీఈకి జరిగిన అన్యాయాన్ని సభలో ఉంచారు, కాంట్రాక్టర్ల వివరణ కూడా వినాలని, ఎవరికి ఏది జరిగినా కౌన్సిల్ను సంప్రదిస్తే బాగుంటుందనడంతో ఆ సమయంలో 26వ వార్డు కౌన్సిలరు పువ్వల శ్రీనివాసరావు కలుగ జేసుకోవడంతో ఒకరితో ఒకరు వాదోపవాదాలు చేసుకున్నారు.
ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అసలు ఈ విషయాన్ని కౌన్సిల్లోనే చర్చించకూడదని పువ్వల అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష పా త్ర పోషించారు. కాంట్రాక్టర్ల వ్యవహార శైలి వల్ల చివరకు ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని చైర్పర్సన్ అనడంతో ఒకేసారి మిగిలిన వారంతా దానిని ఖండించారు. ఉద్యోగులకు ఆ ఆలోచన రావడం నేరమని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఒకవైపు అధికార పార్టీ చైర్పర్సన్, మరో వైపు అదే పార్టీకి చెందిన ఇద్దర కౌన్సిలర్లు కాంట్రాక్టర్లు, అధికారుల వ్యవహారశైలిపై చర్చించుకోవడంతో మిగిలిన సభ్యులు ఆసక్తిగా గమనించారు.
పనులను ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు?
బొబ్బిలి పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల ఎంపికను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని, కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో చేయమని ఇచ్చిన వినతులు ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదని వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడరు రౌతు రామ్మూర్తినాయుడు ప్రశ్నించారు. బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు చెందిన వార్డుల్లో పనులను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 14, 24, 25, 27 వార్డుల్లో పనులు చేయాలని కౌన్సిలర్లు వినతులు ఇచ్చినా వాటిని ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అజెం డాలో ఆన్ లైన్ టెండర్లు అన్నీ తక్కువ శాతానికి, బాక్సు టెండరు పనులన్నీ ఎక్కువ మొత్తానికి దాఖలు చేయడంపై అనుమానాలున్నాయని, పనులన్నీ కాంట్రాక్టర్లు సర్దుకున్నారా అని 7వ వార్డు కౌన్సిలరు రాంబార్కి శరత్ ప్రశ్నించారు.