కాటేసిన కాల్‌మనీ | Contractor killed lender agadalu cable | Sakshi
Sakshi News home page

కాటేసిన కాల్‌మనీ

Jan 3 2015 2:43 AM | Updated on Sep 2 2017 7:07 PM

ఓ కాల్‌మనీ వ్యాపారి ఆగడం నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న సొమ్ము తిరిగిచ్చేయాలంటూ కాల్‌మనీ

వడ్డీ వ్యాపారి ఆగడాలకు  కేబుల్ కాంట్రాక్టర్ మృతి
 
విజయవాడ సిటీ : ఓ కాల్‌మనీ వ్యాపారి ఆగడం నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న సొమ్ము తిరిగిచ్చేయాలంటూ కాల్‌మనీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో దిక్కుతోచని ఓ చిరు కాంట్రాక్టర్ బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. కాల్‌మనీ వ్యాపారి నైజం తెలిసిన మృతుని కుటుంబీకులు విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నట్టు తెలిసింది. సేకరించిన సమాచారం ప్రకారం.. సత్యనారాయణపురానికి చెందిన చంద్రశేఖర్ కేబుల్ కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. వ్యాపార నిర్వహణ కోసం గాంధీనగర్‌లోని శాంతి ప్రశాంతి థియేటర్ ప్రాంతంలో వడ్డీ వ్యాపార సామ్రాజ్యానికి ‘చక్రవర్తి’గా పేరొందిన ఓ వ్యక్తి వద్ద రూ.2లక్షలు కాల్‌మనీగా తీసుకున్నాడు. గత రెండు నెలలుగా కేబుల్ కాంట్రాక్టు పనుల నిమిత్తం రావాల్సిన బిల్లులు బీఎస్‌ఎన్‌ఎల్ వద్ద బకాయిపడ్డాయి. దీంతో ఆర్థికంగా ఇతను ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

దీంతో కాల్‌మనీ చెల్లింపులో జాప్యం జరిగింది. దీనిపై ఆగ్రహించిన వడ్డీ వ్యాపారి కొద్ది రోజులుగా చంద్రశేఖర్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. పైగా నలుగురిలో పదే పదే అవమానిస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా తీవ్ర మనస్థాపానికి లోనైన చంద్రశేఖర్.. ఈ విషయం స్నేహితుల వద్ద చెప్పుకొని వాపోయాడు. వీలైనంత తొందరగా తీసుకున్న కాల్‌మనీ చెల్లిస్తానంటూ ప్రాథేయపడినా వడ్డీ వ్యాపారి తీరు మారకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు చెపుతున్నారు. విషయం తెలిసి కూడా వడ్డీ వ్యాపారి ఆగడాలకు భయపడి కుటుంబ సభ్యులు విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోతున్నట్టు చంద్రశేఖర్ స్నేహితుల సమాచారం. గతంలో కూడా ఎస్‌కెపివి హిందూ హైస్కూలు సమీపంలోని ఓ టైలరింగ్ షాపు యజమాని కొడుకు వడ్డీ డబ్బులు సకాలంలో చెల్లించలేదని నడిరోడ్డుపై కొట్టినట్టు చెపుతున్నారు. నలుగురిలో జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అతను కూడా చంద్రశేఖర్ మా దిరిగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement