'వైఎస్సార్ మరణం ఏపీకి దురదృష్టకరం'
సాక్షి, పోలవరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, దాని ఫలాలు కూడా ప్రజలకు అందేవని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ నీటి విలువ తెలిసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం ఆంధ్ర రాష్ట్రానికి దురదృష్టమని వ్యాఖ్యానించారు.
ప్రజల జీవితాలతో అడుకోవద్దు: రఘువీరా
ధర్నాలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. తమది పనికిమాలిన పాదయాత్ర అయితే పుణ్యాత్ములు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం అన్ని అనుమతులు తీసుకువస్తే టీడీపీ, బీజేపీలు మా కల అనడం హాస్యాస్పదమన్నారు. మూడున్నర ఏళ్లలో గోదావరి ఇసుక మొత్తం దోచేశారని.. మరో ఏడాదిన్నర కాలంలో ఇసుకను పుస్తకంలో చూడవలసిన పరిస్థితి వస్తుందన్నారు.
పోలవరం వచ్చి ఒక శంకుస్థాపన, ఒక భూమి పూజ మాత్రమే చేస్తున్నారని.. కోట్లు ఖర్చు తప్పా ఏమీ జరగటం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ, టీడీపీలు ప్రాజెక్ట్ పేరుతో ప్రజలు జీవితాలతో అడుకోవద్దని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి చేసే 2019 ఎన్నికలకు వెళ్లాలని.. లేదంటే ప్రజలు తన్నుతారని రఘువీరా వ్యాఖ్యానించారు. తమకు గొప్పలు వద్దని.. మగాళ్లు అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయండని ఆయన సవాల్ విసిరారు.