ఎన్నికల ప్రక్రియ ఉన్నతమైన బాధ్యత
జిల్లా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాం మోహన్ మిశ్రా రాయచోటి: ఎన్నికల ప్రక్రియను ఉన్నతమైన బాధ్యతగా భావించాలి. సార్వత్రిక ఎన్నికల వేళ సమర్థవంతంగా పనిచేస్తూ.. భద్రతా నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలి.. జిల్లాలో నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి.. అని జిల్లా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాంమోహన్ మిశ్రా అన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన అబ్జర్వర్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ఎన్నికల సన్నద్ధత, తీసుకున్న చర్యలు, అమలు ప్రక్రియ, భద్రతా చర్యలు తదితర అంశాలపై కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ జనరల్ అబ్జర్వర్కు వివరించారు. అనంతరం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ... స్వేచ్ఛ, పారదర్శక విధానంలో స్నేహపూర్వక వాతావరణంలో జిల్లాలో ఎన్నికలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సీజ్ చేసిన నగదు, వస్తువుల విడుదలలో జాప్యం లేకుండా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో 413 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. మూడు నియోజకవర్గాలలో పూర్తిగా, మిగిలిన నియోజకవర్గాలలో 50 శాతం పైగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలలో భాగంగా స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ కాని నగదు వస్తువులను సులభతరంగా విడుదల చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన జిల్లా సీజర్స్ పరిష్కార కమిటీ ద్వారా తక్షణ పరిష్కారాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో సజావుగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ పోలీస్, వ్యయ పరిశీలకులు దిల్ నవాజ్ అహ్మద్, రవీంద్ర కుమార్, నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్లు, ఓం ప్రకాష్ బంకర్, కవిత ఎస్ మన్నికేరి, వ్యయ పరిశీలకులు వైభవ్ శుక్ల, ఎస్.జి.మూన్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ సత్యనారాయణరావు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.