పెండింగ్ పనులు పూర్తిచేయాలి | completion on Pending works says Smita Sabharwal | Sakshi
Sakshi News home page

పెండింగ్ పనులు పూర్తిచేయాలి

Jan 2 2014 11:48 PM | Updated on Sep 2 2017 2:13 AM

మున్సిపాలిటీల్లో 2010 నుంచి 2013 వరకు మంజూరైన అన్ని పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో 2010 నుంచి 2013 వరకు మంజూరైన అన్ని పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్‌లతో అర్బన్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14కు సంబంధించి మంజూరైన పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు.
 
 10 నుంచి 13 వరకు ఉన్న పనులను జనవరి నాటికి పూర్తి చేయకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డులను ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు కేటాయించడానికి ఆర్డీఓ, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రత్యేక స్థలం లేని మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 15లోగా అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రతిపాదనలను  అందజేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్‌లపై కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషనర్లు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి ప్రధాన కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, నల్లాల వద్ద చెత్త పేరుకోకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా  కమిషనర్లు క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు కార్యక్రమాన్ని ఈ నెల చివరి నుంచి అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో మెప్మా పీడీ పూర్ణ చందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ సీఆర్పీలు, టీఎల్‌ఎఫ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement