పుష్కరాల కోసం 10రోజుల్లో కమిటీ | Committee within 10 days for godavari pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాల కోసం 10రోజుల్లో కమిటీ

Jul 30 2014 1:15 AM | Updated on Sep 2 2017 11:04 AM

గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో ఏర్పాట్ల కోసం పదిరోజుల్లో ఓ కమిటీని నియమిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఇందులో సంబందిత శాఖల అధికారులు,

సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో ఏర్పాట్ల కోసం పదిరోజుల్లో ఓ కమిటీని నియమిస్తామని పురపాలక శాఖ  మంత్రి నారాయణ ప్రకటించారు. ఇందులో సంబందిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. రాజమండ్రి పుష్కరాలకు నిధుల విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో తాను మాట్లాడగా ప్రాజెక్టు రిపోర్టుతో రావాల్సిందిగా సూచించారన్నారు. ఆమేరకు ఈ కమిటీని నియమిస్తామని, అది రూపొందించే నివేదికను కేంద్రమంత్రికి సమర్పిస్తామన్నారు. జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ కోసం స్థల పరిశీల నకు వచ్చిన మంత్రి నారాయణ మంగళవారం కాకినాడ, రాజమండ్రిల్లో పర్యటించి అధికారులతో సమావేశమై స్థలాల లభ్యతపై చర్చిం చారు. తాళ్లరేవు మండలం చొల్లంగి, రాజానగరం, దివాన్ చెరువు, కడియం మండలం వేమగిరి ప్రాంతాల్లో పర్యటించి  స్థలాలను పరిశీలించారు. అనంతరం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కార్పొరేటర్లు, అధికారులతో నగరపాలక సంస్థ అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. అనంతరం మేయర్ ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు.
 
 రూ. 165 కోట్లతో అంచనాలు  
 వచ్చే ఏడాది జూలై నెలలో నిర్విహించే పుష్కరాలకు రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి  కార్యక్రమాలకు రూ. 165  కోట్లు అవసరం అవుతాయని మేయర్ పంతం రజనీ శేషసాయి మంత్రి నారాయణను కోరారు. ఈమేరకు వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. రాజమండ్రిలో కొత్త మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు రూ. 225 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని మేయర్ కోరారు. క్వారీ మార్కెట్ ఏరియాలో కబేళా నిర్మాణానికి రూ. 20 కోట్లు కావాలని మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement