సహకార పీఠాలు మనవే | Co-operation Courts lifetime | Sakshi
Sakshi News home page

సహకార పీఠాలు మనవే

May 10 2014 2:15 AM | Updated on May 29 2018 3:40 PM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు.

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. శని, ఆదివారాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు, చైర్మన్ ఎంపిక జరగనుండటంతో పార్టీ పరంగా అనుసరించాల్సిన అంశాలపై సూచనలిచ్చేందుకు శుక్రవారం ఆయన అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా లింగాల శివశంకర్‌రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
 
 గతేడాది అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నేతలు కుమ్మక్కై అడ్డదారుల్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌లను చేజిక్కించుకోవాలనే ఎత్తులను చిత్తు చేశామని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు వ్యవహరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించామన్నారు. అందులో భాగంగానే ఇపుడు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందిన రైతులు సహకార ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఆదరించారని పేర్కొన్నారు.
 
 ఇపుడు ఆ రెండు పీఠాలపై చైర్మన్ అభ్యర్థులుగా పార్టీ మద్దతుదారులను కూర్చోబెట్టాలన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఓబుళాపురం సొసైటీ అధ్యక్షుడు బోయ మల్లికార్జునకు అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. డీసీసీబీ చైర్మన్ అభ్యర్థిగా ఇప్పటికే లింగాల శివశంకర్‌రెడ్డి పేరును ఖరారు చేశామన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్‌గా మడకశిర సొసైటీ అధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
 ఇక డీసీఎంఎస్ వైస్ చైర్మన్‌గా ఎన్‌పీకుంట సొసైటీ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి లేదా నార్పల సొసైటీ అధ్యక్షుడు పి.జయరామిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉంచారు. సమావేశంలో పార్టీ ఎంపీ అభ్యర్థులు అనంత వెంకటరామిరెడ్డి, డి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్, పెనుకొండ అసెంబ్లీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థులు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా నర్సింహయ్య, వై.మధుసూదన్‌రెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, సాలార్‌బాషా, హెచ్‌డీ నర్సేగౌడ, సానిపల్లి మంగమ్మ, పామిడి వీరాంజనేయులు, దిలీప్‌రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, బోయ తిరుపాలుతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ డెరైక్టర్లు, పలువురు సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement