కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review Meeting Over Covid 19 Preventive Measures - Sakshi

సాక్షి, తాడేపల్లి: కుటుంబ సర్వేలో భాగంగా వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో... 40 సంవత్సరాల పైబడి... ఏదైనా  వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

అదే విధంగా కరోనా లక్షణాలు ఉంటే.. నేరుగా కోవిడ్‌ ప్రధాన ఆస్పత్రికి వారిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్లు అందుబాటులోకి రావడంతో పరీక్షలు పెరుగుతాయని(రోజుకు 10 నుంచి 15 వేల వరకు) పేర్కొన్నారు. ఇక క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కొంతమంది డాక్టర్లతో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏ సమయంలోనైనా అక్కడ ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని... రోగి చికిత్స పొందుతున్న సంబంధిత ఆస్పత్రి వైద్యులకు నిరంతరం గైడెన్స్‌ ఇస్తారని  వెల్లడించారు. అదే విధంగా పేషెంట్‌ పారామీటర్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. (ఇకపై ఏపీలో 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం..!)

ఇదిలా ఉండగా... ఇతర ఎమర్జెన్సీ సర్వీసులకు ఆటంకం కలగకుండా కూడా చర్యలు చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లాల్లో గుర్తించిన కోవిడ్‌ ఆస్పత్రులు కాకుండా మిగతా ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ సర్వీసులు కొనసాగేలా చూస్తున్నామన్నారు. ఇక ఆరోగ్యశ్రీలో నమోదైన రోగులకు నేరుగా కాల్‌ చేసి.. వారికి ఏ ఆస్పత్రిలో సేవలు లభిస్తాన్నయన్నదానిపై సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తున్న సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నవారంతా.. సింగిల్‌ రూమ్‌లోనే ఉన్నారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top