జలవనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరాతి : వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల విభాగం పనితీరుపై మరోసారి సమీక్ష నిర్వహించారు. గతవారం కూడా జలవనరుల విభాగం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టులతో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక, వివరాలతో మరోసారి రావాలని ఆధికారులను ఆదేశించడంతో గురువారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్లో మరోసారి సమావేశమయ్యారు.
సాగు నీటి ప్రాజెక్టులపై థర్డ్పార్టీ విచారణ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే కొన్ని ప్రాజెక్టులలో రీటెండరింగ్కు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్టుల మంజూరు, ఖర్చులపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సభ్యులుగా నీటిపారుదలరంగ, సాంకేతిక నిపుణులు ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అవినీతి ఉండకూడదని, రైతులకు ప్రయోజనాలే ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి కె.ధనంజయ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.