ఆరోగ్య రంగంలో అవి చాలా అవసరం: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Corona Prevention | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలి

Apr 25 2020 3:41 PM | Updated on Apr 25 2020 3:55 PM

CM YS Jagan Review Meeting On Corona Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం చాలా అవసరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ నివారణా చర్యలపై సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం అళ్లనాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
(‘ఆ ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుంది’)

గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర..
గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం పేర్కొన్నారు. ల్యాబ్‌లు లేని మిగిలిన జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.ముందే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని సీఎం తెలిపారు. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 6928 కరోనా పరీక్షలు చేయించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇప్పటివరకూ 61,266 పరీక్షలు చేశామని.. ప్రతి మిలియన్‌ జనాభాకు 1147 పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమస్థానంలో ఏపీ నిలిచిందని తెలిపారు.
(‘నాడు-నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష) 

టెలిమెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలి
టెలిమెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని.. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం అన్నారు. టెలి మెడిసిన్‌కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. అక్కడ పనిచేస్తున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలని సీఎం కోరారు.

మద్దతు లభిస్తోంది..
జనతాబజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తోందని ముఖ్యమంత్రికి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, కరోనా నివారణా చర్యలపై ప్రజలనుంచి అభిప్రాయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement