వైఎస్సార్‌ లా నేస్తం ప్రారంభం | CM YS Jagan Mohan Reddy fulfilled another election promise | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ లా నేస్తం ప్రారంభం

Dec 4 2019 4:02 AM | Updated on Dec 4 2019 9:15 AM

CM YS Jagan Mohan Reddy fulfilled another election promise - Sakshi

సచివాలయంలో మంగళవారం వైఎస్సార్‌ లా నేస్తం పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో న్యాయవాదులు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసి చూపించారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకాన్ని జగన్‌ ప్రారంభించారు. లబ్ధిదారులైన న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ పథకం కింద జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. 

న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు 
దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున స్టైఫండ్‌ ఇవ్వడం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల చట్టంలో మార్పులు తీసుకొస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకం ప్రారంభోత్సవంలో ఏపీ బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, వైస్‌ ఛైర్మన్‌ రామజోగేశ్వర్రావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, సీనియర్‌ న్యాయవాది చిత్తరువు నాగేశ్వర్రావు, ఆర్‌.మాధవి, బార్‌కౌన్సిల్‌ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి, వి.బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
వైఎస్సార్‌ లా నేస్తం వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి అర్హులు 
- జీవో జారీ చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసున్న, బార్‌ కౌన్సిల్‌ రోల్స్‌లో నమోదైన జూనియర్‌ న్యాయవాదులు
- 2016, ఆ తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు  

1970 మంది జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌
వైఎస్సార్‌ లా నేస్తం కింద అర్హులైన 1970 మంది జూనియర్‌ న్యాయవాదులకు నవంబర్‌ నెలకు చెల్లించాల్సిన స్టైఫండ్‌ రూ.98.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో జూనియర్‌ న్యాయవాదికి రూ.5 వేల చొప్పున చెల్లించనున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్‌ లా నేస్తం కింద జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌ చెల్లించేందుకు రూ.5.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement