పీటలెక్కని పెళ్లికానుక | Chandranna Pelli Kanuka Delayed In Chittoor | Sakshi
Sakshi News home page

పీటలెక్కని పెళ్లికానుక

Jun 30 2018 8:48 AM | Updated on Jul 28 2018 5:45 PM

Chandranna Pelli Kanuka Delayed In Chittoor - Sakshi

నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం.. చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థికంగా ఆసరా కల్పిస్తామని చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. పెళ్లి చేసుకుని ప్ర«భుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న జంటలు పెరిగిపోతున్నాయి. పెళ్లి కానుక మాత్రం వారికి ఇంకా చేరడం లేదు. బడుగు, బలహీన వర్గాలు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెంచుకున్నా అధికారవర్గాల్లో స్పందన కనిపించడం లేదు. దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతాలకు టెస్టింగు కోసమంటూ ఒక రూపాయిజమ చేయడం వారిని విస్మయానికి గురి చేస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే జమయిందని ప్రశ్నిస్తే అకౌంటు సరిగా ఉందోలేదో చేక్‌ చేయడానికి జమ చేశామని అధికారులు తెలుపుతున్నారు. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తామంటున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక అందని ద్రాక్షలా తయారైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు సర్కారు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, కులాం తర వివాహాలు చేసుకున్న జంటలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉంది.  ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి  వివాహ మిత్రలను నియమించారు. పెళ్లి కుది రిన 15 రోజుల ముందే చంద్రన్న పెళ్లి కానుకకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పెళ్లి రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటు 1100కు కాల్‌ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. కొందరు తమ వివరాలను అప్‌లోడ్‌ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 804 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 604 మాత్రం ఇప్పటికి పరిశీలన పూర్తి చేసి అర్హులుగా గుర్తించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 327, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 208, ఎస్టీలు 27, ముస్లింలు 30, వికలాంగులు 12 జంటలు  ఉన్నారు.  కులాంతర వివాహం చేసుకున్న 87 జంటల నుంచి దరఖాస్తులు అందాయి.

అందించాల్సిన మొత్తాలు....
ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతేరూ.50వేలు, బీసీలైతే రూ.35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ముస్లిం జంటలకు రూ.15 లక్షలు, ఎస్టీ జంటలకు రూ.12.50 లక్షలు, బీసీ జంటలకు రూ.1.02 కోట్లు, ఎస్సీ జంటలకు  రూ.62.80లక్షలు, వికలాంగ జంటల కు రూ.12లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.38.25 లక్షలు, ఎస్టీలకు రూ.1.50లక్షలు, బీసీలకు రూ.17 లక్షల మేరకు అందించాల్సి ఉంది. రూ.2.61 కోట్లు జమ చేయాల్సి ఉంది. మూడునెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలేదు. వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. అకౌంట్‌లోకే  జమవుతాయనే సమాధానం వారికి వినిపిస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమైంది. దీంతో వారంతా విస్తుపోయారు. తీరా అధికారులను అడిగితే కంగారు పడకండి టెస్టింగ్‌ అని చెప్పారు.

పెళ్లి కానుక మొత్తాలు జమవుతాయి
చంద్రన్న పెళ్లికానుక మొత్తాలు ఈ వారంలోనే జమవుతా యి. ఖాతాకు ఒక్క రూపాయి  టెస్టింగ్‌ కోసం జమచేశాం. ఇప్పటికి 375 ఖాతాలకు జమచేసి టెస్టింగ్‌ చేయగా 60ఖాతాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిసింది. తిరిగి వాటిని యాక్టివేషన్‌ చేసి ని ధులు జమచేస్తాం. యాక్టివ్‌గా ఉన్న ఖాతాల కు రెండు రోజుల్లో జమ చేయనున్నాం.    – రవిప్రకాష్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement