
చంద్రబాబు ద్రోహం చేశారు: భూమన
వైఎస్ జగన్ దీక్షకు రాష్ట్ర ప్రజలు బాసటగా నిలుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
వైఎస్ జగన్ దీక్షకు రాష్ట్ర ప్రజలు బాసటగా నిలుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రజలంతా సమన్యాయం కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి తెలుగువారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారన్నారు. ప్రధానికి లేఖ పేరుతో ప్రజలను మరోసారి వంచించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. నయవంచన రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని కరుణాకరరెడ్డి అన్నారు.
సమైక్యాంధ్ర కోసం జైల్లో ఉండి కూడా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్.జగన్మోహన్రెడ్డి చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతారని అంతకుముందు భూమన అన్నారు. భారతదేశ రాజకీయాల్లోనే సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఏడు కోట్ల మంది జనం జగనన్న వెంట ఉన్నారని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విభజన ప్రకటన చేసిన సోనియాగాంధీ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.