బడ్జెట్ రూ.45 లక్షలు | Budget of Rs 45 lakh | Sakshi
Sakshi News home page

బడ్జెట్ రూ.45 లక్షలు

Oct 6 2014 2:06 AM | Updated on Sep 2 2017 2:23 PM

పైడితల్లి ఉత్సవానికి జిల్లా యంత్రాంగం పనులు పూర్తి చేస్తోంది. ఈ పం డుగ కోసం దాదాపు రూ.45 లక్షలు వరకు అధికారులు ఖర్చు పెడుతున్నారు. ఇందులో శ్రీపైడితల్లమ్మ దేవస్థానం,

విజయనగరం మున్సిపాలిటీ: పైడితల్లి ఉత్సవానికి జిల్లా యంత్రాంగం పనులు పూర్తి చేస్తోంది. ఈ పం డుగ కోసం దాదాపు రూ.45 లక్షలు వరకు అధికారులు ఖర్చు పెడుతున్నారు. ఇందులో శ్రీపైడితల్లమ్మ దేవస్థానం, పురపాలక సంఘాలదే సింహభాగం ఉంది. ఈ రెండు శాఖలు కలిపి రూ.37 లక్షలు ఖర్చు చేస్తున్నాయి.  ఇందులో  శ్రీ పైడితల్లమ్మ దేవస్థానం రూ.17 లక్షలు, పురపాలక సంఘం రూ.20 లక్షలు వ్యయం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక  మొక్కలు, కూరగాయల ఆకృతులు, సైకత శిల్పం ప్రదర్శనకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పలు శాఖ ఆధ్వర్యంలో మరో రూ.5లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.  
 
 పురపాలక వ్యయం రూ.20 లక్షలు
 శ్రీపైడితల్లమ్మ పండగ కోసం పైడితల్లమ్మ దేవస్థానం కన్నా విజయనగరం మున్సిపాలిటీ ఎక్కువ నిధులు వెచ్చిస్తోంది. జాతర కోసం రూ.20 లక్షల వరకు మున్సిపాలిటీ నిధులు సమకూరుస్తోంది. ఇందులో రూ.10  లక్షలు రోడ్ల ప్యాచ్ వర్కు ప నుల కోసం కేటాయించారు.
 
 మిగిలిన రూ.10 లక్షలు.రోడ్డు డివైడర్‌లకు రంగులు,  ప్రధాన కూడళ్లలో నాయకుల విగ్రహా లకు లైటింగ్ నిర్వహణకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. భక్తులకు   తాగునీటి చలివేంద్రాల ఏర్పాటు, పండగ రోజుల్లో అదనపు పారిశుద్ధ్య సిబ్బంది నియామకం, సులభ్ కాంప్లెక్సుల నిర్వహణ ఇతరత్రా వాటికి ఖర్చు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
 దేవస్థానం ఖర్చు రూ.17 లక్షలు
 ఉత్సవం కోసం పైడితల్లమ్మ దేవస్థానం రూ.17 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందులో పండగ రోజుల్లో విద్యుత్ కాంతుల నిర్వహణకు లడ్డూ ప్రసాదంలో నేయి కోసం,  సిరిమాను రథం తిరిగే ప్రాంతంలో బారికేడ్ల నిర్మాణం కోసం రోడ్లు, పండగలో పోలీసు బందోబస్తు కోసం ఖర్చు చేస్తున్నారు. అలాగే దేవస్థానం సిబ్బంది టీఏ, డీఏలు, వీఐపీ ఖర్చులు, అన్నదానం, విద్యుత్ అదనపు మీటర్ల ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నారు. 2014-15 ఆర్థిక ఏడాది నిధులతో ఈ వ్యయం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
 గత ఏడాది రూ.16 లక్షల వరకు ఖర్చు చేయగా.. ఈ ఏడాది అదనంగా రూ.లక్ష వ్యయం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ చాలకుంటే మరికొన్ని నిధులు ఖర్చు చేసే వెసులుబాటు ఉన్నట్టు బోర్డు సభ్యులు తెలిపారు.
 
 ఆర్టీసీ సేవలు
 పైడితల్లమ్మ పండగ కోసం ఆర్టీసీ 150 అదనపు సర్వీసులు నడపనుంది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని అదనపు బస్సులను వేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 1025 ట్రిప్పుల ద్వారా వేలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సాయం అందించింది. దీని ద్వారా దాదాపు రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. ఈసారి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
 వైద్య శిబిరాలు...
 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పైడితల్లమ్మ పండగను పురస్కరించుకుని పలుచోట్ల తాత్కాలిక వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. పలు ప్రాంతాల నుంచి అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు అనారోగ్యం బారిన పడితే ఇక్కడ ఉచితంగా మందులను అందజేస్తారు.
 
 విద్యుత్ శాఖ..
 పండగలో విద్యుత్ శాఖ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రజారోగ్య సాంకేతిక శాఖ, అబ్కారీ శాఖ, అగ్నిమాపక శాఖలు కూడా పండగ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement