ఏపీ ప్రభుత్వం హడా వుడిగా ప్రకటించిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’కు ఆదిలోనే హంసపాదు పడింది.
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం హడా వుడిగా ప్రకటించిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’కు ఆదిలోనే హంసపాదు పడింది. భూములు, స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చం టూ జారీ చేసిన ఉత్తర్వులు పక్షం రోజులుగా ఎక్కడా అమలు కావట్లేదు. ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్’ (ఏ జిల్లాలో ఉన్న స్థిరాస్తులనైనా ఏ జిల్లాలోని సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలోనైనా)పై ఈ నెల నాలుగో తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టంలో పలు సవరణలు కూడా చేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయిదు (జీవో నంబరు 21 నుంచి 25) ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఈ జీవోలు అమలుకు నోచుకోలేదు. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన ముందస్తు కసరత్తు, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు కారణం.
లోపాలమయంగా సెంట్రల్ సర్వర్
ఎనీవేర్ రిజిస్ట్రేషన్కు కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) సెంట్రల్ సర్వర్లో చేసిన మార్పులు లోపాలమయంగా ఉన్నాయి. దీంతో ఈ విధానం ద్వారా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తే అనేక సమస్యలు వస్తాయని, వీటికి బాధ్యత ఎవరిదంటూ క్షేత్రస్థాయి అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్కు ఏర్పాట్లు, కార్డ్ సెంట్రల్ సర్వర్లో చేసిన మార్పులపై ఉన్నతాధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా.. సబ్రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు పలు ప్రశ్నలు సంధించారు. వాటిలో ముఖ్యమైనవి...
పట్టణాల్లో నిషేధిత ఆస్తుల జాబితా (పీఓబీ) ఫ్లాట్ నంబర్ల వారీగా సెంట్రల్ సర్వర్లో లేదు. దీనివల్ల ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయితే అందుకు ఎవరు బాధ్యులవుతారు?
భూముల రిజిస్ట్రేషన్ల నిషేధానికి (నిలుపుదలకు) సంబంధించి కోర్టులు ఇచ్చే ఉత్తర్వులను అమలు చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. దీనివల్ల కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు ఎవరు బాధ్యులవుతారు. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఒక సర్వే నంబరులోని భూమిని రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా జడ్జి ఉత్తర్వులు ఇస్తారు. ఈ విషయం తెలియక గుంటూరు సబ్ రిజిస్ట్రారు చేస్తారు. ఇలా జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలేవి?
ఇప్పటి వరకూ మార్కెట్ విలువలకు సంబంధించి వచ్చే అప్పీళ్లపై జిల్లా రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకునే వారు. ఇకపై ఈ అంశంలో ఎవరు నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి పలు ప్రశ్నలు సంధించిన అధికారులు వీటి పరిష్కారానికి తీసుకోవా ల్సిన జాగ్రత్తలను కూడా సూచించారు.
నాడే చెప్పిన ‘సాక్షి’
ముందు జాగ్రత్తలు లేకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అమల్లోకి తెస్తే ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ కావడమే కాకుండా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ‘సాక్షి’ మొదటే చెప్పింది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్తో ప్రభుత్వ భూములకు ఎసరు’ శీర్షికతో గత నెల 17న సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం విదితమే. సాక్షి పేర్కొన్న అంశాలను ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రశ్నల రూపంలో సంధించారు. దీంతో ఈ సమస్యలను అధిగమించే మార్గాలతో సెంట్రల్ సర్వర్లోనూ, ఉత్తర్వుల్లోనూ మార్పులు చేసే వరకూ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బదులు పాత విధానమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.