10 జిల్లాలతో కూడిన తెలంగాణకే కట్టుబడి ఉన్నాం:కిషన్ రెడ్డి
హైదరాబాద్:రాయల తెలంగాణకు అంగీకరించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గతం నుంచి 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే కట్టుబడి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై సీమాంధ్రులకు పలు అనుమానాలు, భయాలున్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కిషన్ రెడ్డి సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
అంతకుముందు రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు డా. రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఎంతో మంది బలిదానాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమేనన్న విషయం కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే..కాంగ్రెస్ మాత్రం రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలతో నాటకాలాడుతుందని రాజేశ్వరరావు మండిపడ్డారు.