టీడీపీతో బీజేపీకి అవమానాలు | Sakshi
Sakshi News home page

టీడీపీతో బీజేపీకి అవమానాలు

Published Sat, Mar 12 2016 9:31 AM

bjp leader slams tdp

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు విమర్శ
 
భీమవరం : రాష్ర్టంలో టీడీపీకి బీజేపీ మిత్రపక్షమైనా అనేక చోట్ల అధికార పార్టీ నుంచి తమ కార్యకర్తలు, నాయకులకు అవమానాలు, వేధింపులు తప్పడంలేదని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరాజు విమర్శించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో కనీసం ప్రాధాన్యం ఇవ్వడం లేదని శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో బలీయమైనశక్తిగా ఎదిగి నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడం ఖాయమన్నారు.
 
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై దుష్ర్పచారం చేస్తుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మంజూరు చేసిన నిధులకు లెక్కలు చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాకా సత్యనారాయణ, అల్లూరి సాయిదుర్గరాజు, కాగిత సురేంద్ర, బూసి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement