కామారెడ్డిపై ‘కమలం’ నజర్ | BJP focused on assembly seat in kamareddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డిపై ‘కమలం’ నజర్

Jan 24 2014 6:15 AM | Updated on Mar 28 2019 8:37 PM

బీజేపీ అగ్రనేతలు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డి, న్యూస్‌లైన్: బీజేపీ అగ్రనేతలు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీల్లో వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. కీలకమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చవచ్చని ఆ పార్టీ భా విస్తోంది. నియోజక వర్గంలో హిందుత్వవాదం బలం గా ఉండడంతో పాటు తెలంగాణ వాదం కూడా తోడు గా ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీని మరిం త బలోపేతం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు. టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన నిట్టు వేణుగోపాల్‌రావును పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న కామారెడ్డిలోని తాడూరి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు.
 
  కామారెడ్డి పట్టణంలో బీజేపీ బలంగా ఉండేది. మున్సిపాలిటీలో 8 మంది కౌన్సిలర్లు ఉండేవారు. పట్టణంలో ఆ పార్టీ బలం అలా ఉండేది. అయితే కొం దరు పార్టీని వీడిన తరువాత పార్టీ కొంత వెనక్కు వెళ్లి నా తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డ తరువాత తిరిగి పుంజుకుంటోంది. టీఆర్‌ఎస్‌లో తరువాత టీడీపీలో కొంతకాలం పనిచేసిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టి.విఠల్‌గుప్తా గతేడాది బీజేపీలో చేరారు. ఆయన నియోజక వర్గం అంతటా తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇటీవల నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర కూడా చేపట్టారు. తాజాగా టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి నిట్టు వేణుగోపాల్‌రావు ఈ నెల 25న అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. నిట్టు చేరికతో ఆ పార్టీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆయన కూడా రాబోయే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తారు. అలాగే లెక్చరర్‌గా పనిచేస్తున్న ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్‌మోహన్‌తో పాటు ప్రైవేటు కళాశాల సీఈఓ హరిస్మరణ్‌రెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ఇరువురూ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ శిష్యుల సమాచారాన్ని సేకరించి, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ వస్తే వారిని ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై ప్రణాళికలు రూపొందించుకుటున్నారు.
 
 జహీరాబాద్‌పై జెడ్పీ మాజీ చైర్మన్ కన్ను
 జడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆయన జహీరాబాద్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. కామారెడ్డికి పొరుగు నియోజక వర్గమైన ఎల్లారెడ్డిలో ఆ పార్టీ నేత బాణాల లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో హిం దూత్వం, తెలంగాణ వాదాలు బలంగా ఉన్న కామారెడ్డి నియోజక వర్గంలోనూ పాగా వేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవరిని వరిస్తుందన్నది కాకుండా అందరూ పార్టీని విస్తరించేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది.  
 
 సభను విజయవంతం చేయాలి
 కామారెడ్డి మున్సిపాలిటీ : బీజేపీ భారీ బహిరంగను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళధర్ గౌడ్ కోరారు. ఈసభను విజయవంతం చేయడానికి ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement