ఏఐ సేవల దిశగా ఐటీ ఎదగాలి | Keynote speech under the auspices of Hyderabad Software Enterprises Association | Sakshi
Sakshi News home page

ఏఐ సేవల దిశగా ఐటీ ఎదగాలి

Jul 12 2026 4:42 AM | Updated on Jul 12 2026 4:42 AM

Keynote speech under the auspices of Hyderabad Software Enterprises Association

స్వదేశీ ఐటీ పరిశ్రమలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పిలుపు 

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కీలక ప్రసంగం 

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఐటీ పరిశ్రమ ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ సేవల ఆధారిత నమూనా నుంచి ఏఐ సేవల నమూనా వైపు మారాలని కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార సాంకేతికత, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వికసిత్‌ భారత్‌–2047 నిర్మాణంలో సాంకేతికత పాత్ర అనే అంశంపై సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. అనంతరం పరిశ్రమ ప్రముఖులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా ఏఐ, సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్‌ రంగాల్లో తయారీ, అధునాతన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దేశం వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య పరస్పర సహకారంతో ఏఐ రంగంలో మార్పులను అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ భాగస్వామ్యంతో నాస్కామ్‌ ఒక సమగ్ర పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేసిందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 

ఎల్రక్టానిక్స్‌ తయారీ రంగం త్వరలో రూ. 20 లక్షల కోట్లకు.. 
ప్రస్తుతం 12 సెమీకండక్టర్‌ ప్లాంట్లు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిలో మూడు ప్లాంట్లు ఇప్పటికే జపాన్, యూరప్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు చిప్‌లను ఎగుమతి చేస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రతిభావంతుల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం 315 విశ్వవిద్యాలయాలకు అధునాతన సెమీకండక్టర్‌ డిజైన్‌ సాధనాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం విలువ ప్రస్తుత రూ. 13 లక్షల కోట్ల నుంచి త్వరలో రూ. 20 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అంచనా వేశారు.

ఒక్క తెలంగాణలోనే 104 ఎల్రక్టానిక్స్‌ తయారీ కంపెనీల ఏర్పాటుకు కేంద్రం సహకరించిందని, 4 ఎల్రక్టానిక్స్‌ తయారీ క్లస్టర్లను, ఒక కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ)ను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు హైదరాబాద్‌ హబ్‌గా మారుతుందని.. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సెమీకండక్టర్లు, ఏఐ, కవచ్‌ టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్‌ వంటి రంగాల్లో హైదరాబాద్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. 

తెలంగాణలో జరిగే అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించి సమతుల్య ప్రాంతీయ వృద్ధి కనిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ కొండకల్‌లోని మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని, ఫ్యాబ్‌ సిటీ రోడ్డులోని మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సందర్శించారు. రైల్వే కోచ్‌లను మేధా సంస్థ అద్భుతంగా తయారు చేస్తుందని, భవిష్యత్తులోనూ ఇదే తరహా నాణ్యతను కొనసాగించాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement