నాలుగు నెలల్లో కార్యకలాపాలు..పంపుసెట్లకు మీటర్లు ఉండవు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం) కీలక అంకాన్ని అధిగమించింది. ఈ డిస్కమ్ ఏర్పాటుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. శనివారం విద్యుత్ పంపిణీ లైసెన్స్ను ఈఆర్సీ జారీ చేసింది. రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఉండవని ఈఆర్సీ స్పష్టత ఇచ్చింది.
కొత్త డిస్కమ్ నాలుగు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఈఆర్సీ పేర్కొంది. విద్యుత్ టారిఫ్ విషయంలో ఎలాంటి మార్పుల్లేవని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన టారిఫ్, సబ్సిడీలు అమల్లో ఉంటాయని కమిషన్ వెల్లడించింది. 2027–28 ఆర్థిక సంవత్సరానికి మూడు డిస్కమ్లు ఈ ఏడాది నవంబర్ 30లోపు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. రైతు డిస్కమ్పై ఈఆర్సీ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది.
ఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం...
» రైతు డిస్కమ్ మూడు నెలల్లో లోడ్ అంచనాలు, లైన్ లాసెస్ తగ్గింపు, ఇంటర్ ఫేస్ మీటరింగ్, సిబ్బంది, ఆర్థిక అంశాలతో కూడిన సమగ్ర వ్యాపార ప్రణాళికలను కమిషన్కు సమర్పించాలి.
» రైతు, ఉత్తర, దక్షిణ డిస్కమ్ల మధ్య ఆపరేషన్, మెయింటెనెన్స్, వినియోగదారుల డేటా బదిలీ, విద్యుత్ సరఫరా, ఎనర్జీ అకౌంటింగ్లపై అవగాహన ఒప్పందాలు చేసుకోవాలి. కమిషన్ ఆమోదానికి సమర్పించాలి.
» రైతు డిస్కమ్ కనీసం రెండు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వేదిక (సీజీఆర్ఎఫ్)లను ఏర్పాటు చేయాలి. ఇవి ఏర్పడే వరకు ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్ ఫోరంలే ఫిర్యాదులను పరిష్కరిస్తాయి.
» ఉత్తర, దక్షిణ డిస్కమ్ల పరిధి మార్పులు, వినియోగదారుల మార్పునకు ఈ రెండు డిస్కమ్లు దాఖలు చేసిన పిటిషన్లను ఈఆర్సీ ఆమోదించింది.
» కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీపై ఎలాంటి ఆంక్షల్లేవు. నిలిపివేయడం ఉండదు. రైతు డిస్కమ్ పూర్తిగా కార్యకలాపాలు సాగించే వరకు ఉత్తర, దక్షిణ డిస్కమ్లే దరఖాస్తులు స్వీకరించి, కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తాయి.


