నా కుటుంబంలో రాజకీయాల్లో ఉండేది నేనొక్కడినే..
తాడూ లేదు బొంగరం లేదు... సర్వేలు ఇప్పుడెందుకు చేయిస్తాం
డీలిమిటేషన్, మహిళా బిల్లు, జమిలి ఎన్నికలు ఖాయంగా వస్తాయి
పూరీలు చేయమని మనుమడు అడిగితే చేశాను
ఎంసీఆర్హెచ్ఆర్డీ చైర్మన్గా సీఎంకు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది
వందల కోట్లు ఖర్చు పెట్టాననడంలో వాస్తవం లేదు
ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థా నం బోర్డు సభ్యుల నియామకం తన శాఖ పరిధిలోకే వస్తుందని, వైటీడీఏ మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈబోర్డు సభ్యుల నియామకంలో తాను ఎవరినీ సంపద్రించలేదన్న ఆరోపణల్లో పస లేదని, తన శాఖ పరిధిలోకి వస్తుంది కనుకనే దేవాలయానికి అవసరమైతే ఓ పది కోట్లు విరాళంగా ఇవ్వగలిగిన వారిని చూసి సభ్యులుగా నియమించామని చెప్పా రు. ఈ బోర్డులో నల్లగొండ జిల్లా వారే ఉండాలన్న నిబంధన లేదని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అనేక రాష్ట్రాల సభ్యులుంటారని ఆయన గుర్తు చేశారు.
శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం అనంతరం బోధ్ పెవిలియన్లో ఆయన విలేకరుల తో ఇష్టాగోష్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలలోపు నియోజకవర్గాల పునరి్వభజన జరుగుతుందని, మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని, జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయని చెప్పారు. అసలు ఏ నియోజకవర్గాన్ని ఎలా విభజిస్తారో, ఏ నియోజకవర్గం ఎవరికి రిజర్వు అవుతుందో తెలియనప్పుడు తాడూ లేదు బొంగరం లేదన్నట్టు ఇప్పుడు సర్వేలు ఎందుకు చేయిస్తామని ప్రశ్నించారు.
ఎవరికి ఏ స్థానం రిజర్వు అయినా తన కుటుంబంలో తాను ఒక్కడినే రాజకీయాల్లో ఉంటానని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తాను పూరీలు చేసిన వీడియో వైరల్ అయిందన్న విషయం విలేకరులు తన దృష్టికి తీసుకురాగా, తన మనుమడు పూరీలు చేయమని అడిగితే చేశానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక గతంలో ఉన్న ఏ పథకాన్ని కూడా నిలిపివేయలేదని, అన్ని పథకాలు కొనసాగిస్తున్నానని చెప్పారు.
క్యాంపు ఆఫీసును విలేకరులకు చూపించిన సీఎం
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) చైర్మన్గా తన క్యాంపు ఆఫీసు ఇక్కడ పెట్టుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని రేవంత్రెడ్డి చెప్పారు. తాను అధికారిక నివాసంలో ఉండటం లేదు కనుక కొన్ని స్వతంత్ర వ్యవస్థలకు చెందిన వారు అక్కడకు రావడం సరికాదని, అందుకే ఇక్కడ క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు.
తన క్యాంపు ఆఫీసుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానడడంలో వాస్తవం లేదని చెప్పిన రేవంత్రెడ్డి బోధ్ పెవిలియన్ను విలేకరులకు చూయించారు. అక్కడ సీఎం కార్యాలయం, కాన్ఫరెన్స్ హాల్, లాన్తోపాటు లోయర్ గార్డెన్తో సహా విలేకరులకు చూపించారు. చిన్న కార్యాలయంలో పనిచేస్తున్నానని, అందరికీ అందుబాటులో ఉండేలా ఇక్కడ అధికారిక సమీక్షలు చేస్తున్నానని రేవంత్ చెప్పారు.


