కడప మేత్రాసనం బిషప్ గల్లేల ప్రసాద్పై దాడి, కిడ్నాప్ మిస్టరీ వీడింది. విచారణ వేగాన్ని పెంచి మూడు రోజుల్లోనే పోలీసులు పురోగతి సాధించారు.
ఖాజీపేట: కడప మేత్రాసనం బిషప్ గల్లేల ప్రసాద్పై దాడి, కిడ్నాప్ మిస్టరీ వీడింది. విచారణ వేగాన్ని పెంచి మూడు రోజుల్లోనే పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించారు. దాదాపు 15 మందిని అనుమానితుల కింద అదుపులోకి తీసకున్నారు.
రెండురోజులుగా నిందితులను వేర్వేరు స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నారు. వారిలో చర్చి మత గురువు రాజారెడ్డి కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరో ఇద్దరు మత గురుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. బిషప్పై దాడి ఆర్థిక విషయాల కోసమే జరిగినట్లు తెలుస్తోంది. కడప మేత్రాసనంలో పోక్రోటర్ పదవి కీలకమైంది. ఆర్థిక లావాదేవీలన్నీ ఇతని ద్వారానే జరుగుతాయి. కోట్ల రూపాయలు ఎలాంటి ఆడిటింగ్ లేకుండానే మంజురు చేస్తారన్నట్లు సమాచారం.
గతంలో ఈ పదవిలో ఉన్నవారు దాడికి కారణమయిన వారికి అనుకూలంగా ఉండేవారు. వారంతా బదిలీ కావడంతో ఈ పదవిలో తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునే విషయంలో బేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో బిషప్పై తీవ్ర ఓత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అందుకు బిషప్ అంగీకరించకుండా వేరొకరిని నియమించడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. బిషప్ పై దాడి చేసి, బెదిరించైనా తమకు అనుకూలమైన వారిని నియమించు కోవాలనుకున్నారు. కేసు నమోదు కావడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది.