
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు శంకుస్థాపన చేశారనే సమాచారంతో గిరిజనులు ఒక్కసారిగా భగ్గుమన్నారు
సీలేరు : మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు శంకుస్థాపన చేశారనే సమాచారంతో గిరిజనులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. జీకేవీధి, చింతపల్లి మండలాలకు చెందిన ఆదివాసీలు సంప్రదాయ ఆయుధాలతో బాక్సైట్ నిక్షేపాలు ఉన్న కొండపైకి శనివారం చేరుకున్నారు. బలపం, రాళ్ళగెడ్డ, కుడుమసారె పంచాయతీలకు చెందిన గిరిజనులు గోపురం కొండ వద్ద, జర్రెల, వంచెల, మొండిగెడ్డ, ఎ.దారకొండ పంచాయతీల గిరిజనులు వడ్ల చెరువు ప్రాంతానికి చేరుకొని కొండలపై ర్యాలీ నిర్వహించారు.
తవ్వకాలు అడ్డుకుందాం.. ప్రాణాలైనా అర్పిద్దాం, గ్రామాలపై పోలీసు దాడులను, ఆపరేషన్ గ్రీన్హంట్లను నిలిపివేయాలని, మన్యంలో పోలీసు శిబిరాలను అడ్డుకుందామంటూ నినాదాలు చేశారు. గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు ఎవరు వచ్చినా తరిమి కొడతామన్నారు. కార్యక్రమంలో జెర్రెల నుంచి అడపా విజయలక్ష్మి, సీపీఐ మండల కార్యదర్శి చిన్నబ్బాయి, జెర్రెల వార్డుసభ్యుడు పండన్న పాల్గొన్నారు.