అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు కుట్ర | Assembly elections postpone Conspiracy :Ambati Rambabu | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు కుట్ర

Jan 27 2014 3:05 AM | Updated on May 25 2018 7:29 PM

అసెంబ్లీ ఎన్నికలను ఆరు నెలలపాటు వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.

 తెనాలి రూరల్, న్యూస్‌లైన్ :అసెంబ్లీ ఎన్నికలను ఆరు నెలలపాటు వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని పాత రత్నాటాకీస్ ఆవరణలో తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పార్టీ సీఈసీ సభ్యుడు గుదిబండి చినవెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథి అంబటి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్నుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ధైర్యంగా పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.
 
 జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి నాయకులు, కార్యకర్తలు అన్న తేడాలేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతూ.. ప్రతి ప్రజాసమస్యపైనా స్పందించేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టంచేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అన్ని వర్గాలు నష్టపోయాయని, ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.  పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నిపార్టీలు వచ్చినా వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చలేవని, రోజు రోజుకీ వైఎస్ జగన్ గ్రాఫ్ పడిపోతోందన్న ఎల్లోమీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైఎస్ జగన్ గ్రాఫ్‌ను తలకిందులుగా నిలబడి చూసి కిందకు వెళుతుందన్న భ్రమలో ఎల్లోమీడియాతోపాటు, ఇతర పార్టీలు ఉన్నాయని ఎద్దేవాచేశారు. 
 
 పార్టీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ 2009 ఎన్నిలకల్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయినా, ఒంటి చేత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదనని పేర్కొన్నారు పేదల కోసం మహానేత ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జగనమోహన్‌రెడ్డితోనే కొనసాగుతాయన్నారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకటరోశయ్యలు మాట్లాడుతూ కార్యకర్తల సలహాలు, సూచనలతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాల అనంతరం నియోజకవర్గంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 
 
 సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు షేక్ షౌకత్ (గుంటూరు తూర్పు), కె.సురేష్‌కుమార్ (తాడికొండ), మేరుగ నాగార్జున (వేమూరు), రైతు విభాగం జిల్లా కన్వీనర్ మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌లు ఆలమూరి విజయలక్ష్మీకుమారి, దొడ్డక సీతామహాలక్ష్మి, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సైదా, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement