స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధిలో నిల్వలు నిండుకున్నాయి. వేసవి కారణంగా రక్తదాతలు
పార్వతీపురం: స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధిలో నిల్వలు నిండుకున్నాయి. వేసవి కారణంగా రక్తదాతలు ముందుకురాకపోవడంతో మంగళవారం నాటికి 8 ప్యాకెట్ల(యూనిట్ల) రక్తం మాత్రమే నిల్వ ఉంది. ఈ విషయమై రక్తనిధి ఇన్చార్జి జి.వాసుదేవరావు మాట్లాడుతూ పార్వతీపురం సబ్ప్లాన్ ప్రాంతంతోపాటు సమీప శ్రీకాకుళం జిల్లా, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన రోగులు ఆస్పత్రికి అధికంగా వస్తున్నారని చెప్పారు. వీరిలో పలువురికి రక్తం అవసరమవుతోందని చెప్పారు. కానీ రక్తదానం చేసేందుకు కొద్దిమంది మాత్రమే ముందుకు వస్తుండటంతో అవసరాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి రోజు 8 నుండి 10 ప్యాకెట్ల(యూనట్ల) రక్తం అవసరమవుతుందని తెలిపారు. దీనికితోడు అన్-స్క్రీన్డ్ రక్తం నిల్వ చేసేందుకు ఫ్రిజ్ లేదని చెప్పారు. మరోవైపు ఏపీసాక్స్ కి ట్ల పంపిణీ ఆగిపోయిందన్నారు. దీంతో అవస్థలు తప్పడం లేదన్నారు. రక్తదానానికి ఎప్పుడూ ముందుకొచ్చే దాతలు తప్ప కొత్తవారు రావడం లేదన్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థల వారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానంపై యువతకు అవ గాహన కల్పించాలని సూచించారు.