
స్వామి ఉత్తర ద్వారం వద్ద మూత్ర విసర్జన చేస్తున్న ఆలయ ఉద్యోగి
సాక్షి, విశాఖపట్నం:సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆపచారంపై అపచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆలయంలో చోటు చేసుకుంటున్న పలు అవాంఛనీయ సంఘటనలతో భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి తిలోదకాలివ్వడం, సుప్రభాత, పవళింపు సేవల్లో అన్యాయాలు, అర్చకుల్లో ఆధిపత్య పోరు వంటి ఘటనలు వెలుగు చూశాయి. కొద్దిరోజుల క్రితం రాజభోగం సమయంలో ఓ మహిళ గర్భ గుడిలో ఉండడం తీవ్ర దుమారం రేపింది. దీనిని అపచారంగా భావించిన భక్తజనం నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాక్షాత్తూ ఆలయ ఉద్యోగే అపచారానికి పాల్పడ్డాడు. పరమ పవిత్రంగా భావించే స్వామి ఉత్తర ద్వారం సమీపంలో సూరిబాబు అనే నాలుగో తరగతి ఉద్యోగి బహిరంగంగా, పట్టపగలు మూత్ర విసర్జన చేశాడు. దానిని కొంతమంది భక్తులు కెమెరాలో బంధించారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.