ఎక్సైజ్‌ శాఖలో మార్పులు తెస్తాం: మంత్రి నారాయణ స్వామి

AP Minister Narayana Swamy Says We Will Make Changes in the Excise Department - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖలో మార్పులు తెస్తామని ఆ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తామని, తొలివిడతగా బెల్టుషాపుల నిర్మూలనపై దృష్టి పెట్టామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కో అధికారి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని సారా తయారీని అరికట్టాలని ఇప్పటికే ఆదేశిలిచ్చామని చెప్పారు. కల్తీమద్యం అమ్మకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించామన్నారు.

సీఎం ఆలోచనల మేరకు ఎక్సైజ్‌ నూతన పాలసీ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనుల విషయంలో మీడియా ప్రజలకు వారధిలా నిలవాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది.. బడి, గుడికి దూరంగా మద్యం షాపులు ఉండేలా చేస్తామన్నారు. పేదలకు మద్యాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మద్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది అన్ని కుటుంబాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. కల్లుగీత కార్మికులను ప్రభుత‍్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top