జూలై 27 నుంచి ఎంసెట్
సవరించిన షెడ్యూళ్లను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్–2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్–2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్కుమార్ బుధవారం విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించేలా షెడ్యూల్ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్సెట్, పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది. అయితే కరోనా, లాక్డౌన్లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది.
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంసెట్కు 2,48,614 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్కు 1,69,137, అగ్రి,మెడికల్కు 78,959, రెండింటికీ 518 దరఖాస్తులు వచ్చాయి.