బయట ఉన్నా బేసిన్‌లో భాగమే | Sakshi
Sakshi News home page

బయట ఉన్నా బేసిన్‌లో భాగమే

Published Fri, Nov 17 2017 1:41 AM

AP argument before the Brijesh Tribunal on Krishna Delta - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో డెల్టా ప్రాంతం ఎక్కువ భాగం కృష్ణా బేసిన్‌కు బయట ఉన్నా అది బేసిన్‌లో భాగమేనని, డెల్టాలో వర్షం నీరు ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ప్రాంతంలో మాత్రమే సాగుకు ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై గురువారం కూడా జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు విచారణ జరిగింది. ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది వి.రవీందర్‌రావు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు.

డెల్టాలో వర్షం వల్ల వచ్చే నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన మాత్రమే సాగుకు వినియోగిస్తారని, ఇక్కడ కాలువల ద్వారా వచ్చే నీటిని వినియోగించరని సుబ్బారావు సమాధానాలిచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పాలార్, పొన్నిర్‌ నదీ బేసిన్‌లకు కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు కదా? అని రవీందర్‌రావు ప్రశ్నించగా.. ఇది నిజమేనని, అయితే కృష్ణా నదిలో మిగులు జలాలను మాత్రమే హంద్రీనీవాలో వినియోగిస్తున్నామని సుబ్బారావు సమాధానం చెప్పారు.

కృష్ణా బేసిన్‌లో 95 శాతం డెల్టా ప్రాంతం బేసిన్‌ బయట ఉందికదా.. అని ప్రశ్నించగా.. డెల్టా వ్యవస్థ బేసిన్‌కు బయట ఉన్నా అది బేసిన్‌లో భాగమేనని సుబ్బారావు చెప్పారు. ఇక కేసీ కెనాల్‌ ఆధునీకరణ వల్ల దాని అవసరాలు 39 టీఎంసీల నుంచి 19 టీఎంసీలకు తగ్గుతుంది కదా! అని రవీందర్‌రావు పేర్కొనగా.. ఈ వాదనను తిరస్కరిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. తదుపరి విచారణ శుక్రవారం కూడా జరగనుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement