అరకొర వేతనాలు..అర్ధాకలి బతుకులు

Anganwadi Protest Against Tdp Governament - Sakshi

నెల రోజులు పడిన కష్టానికి ఒకటో తేదీనే వేతనం అందితే ఉద్యోగులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అన్నాళ్లూ పడిన కష్టాన్ని ఆ క్షణంలో కాసేపు మరచిపోతారు. కానీ, చిరు వేతన జీవులకు చంద్రబాబు సర్కారు ఆ ఆనందాన్ని దక్కనివ్వడంలేదు. వేతనాలే కాదు.. బిల్లులు, ఇతర ఖర్చులు ఇవ్వకుండా వారిని ఏడిపిస్తున్నారు. టార్గెట్‌ చేరుకోలేదన్న కారణంతో జిల్లాలోని 255 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎఫ్‌టీఏ ఇవ్వలేదు. జిల్లాలోని 10,500 మంది అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలకు నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 

చేతి చమురు వదిల్చే ప్రచారం
ప్రభుత్వం ప్రచారం కోసం అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించుకుందనే ఆరోపణలున్నాయి. కేంద్రాల్లో తల్లులు, పిల్లలకు అవగాహన పేరుతో వివిధ రకాల ఈవెంట్లు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విదల్చక పోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు చేతి చమురు వదులుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. నెలకు రెండు కార్యక్రమాల వంతున ఆరు నెలలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలను గత ఏడాదిగా నిర్వహిస్తున్నారు. నెలకు రూ.500 వంతున చెల్లించాల్సి ఉండగా, ఎనిమిది నెలలుగా చెల్లించాల్సిన ఈవెంట్‌ బకాయిలు రూ.2.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే రవాణా భత్యం రెండేళ్లుగా రూ.6.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలంటూ గతంలో పలుమార్లు అంగన్‌వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినా ఫలితం లేదు. 

మూడు నెలలుగా వేతనాలకు నోచని ‘ఆశ’ వర్కర్లు 
పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. గతేడాది డిసెంబరు వరకు మాత్రమే వీరికి వేతనాలు చెల్లించారు. ఒక్కో ఆశ కార్యకర్తకు రూ.3 వేల గౌరవ వేతనం ఇస్తుండగా, మిగిలింది పనికి తగ్గ పారితోషికం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా పనికి తగ్గ పారితోషి కం ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన. ఒక్కో ఆశ కార్యకర్త రూ.5 వేల పారితోషికానికి సరిపడా పనిచేసినా, కేవలం మూడు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 4,500 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. వివాహితలు గర్భవతులైనప్పటి నుంచి ఆరోగ్యపరంగా వారి బాగోగులు చూడడం, ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించడం, ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడడం వీరి బాధ్యత. చిన్నారుల ఆరోగ్య రక్షణకు టీకాలు వేయించేందుకు బాధ్యత వహిస్తారు. టీబీ పేషెంట్లకు మందులు సక్రమంగా అందజేయడం కూడా చేస్తారు. అయినా పనికి తగ్గ పారితోషికం రావడం లేదన్నది వీరి ఆవేదన.  

బిల్లుల కోసం గొల్లుమంటున్న అంగన్‌వాడీలు
జిల్లాలో 28 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 5,113 అంగన్‌వాడీ, 433 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 10,500 మంది అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. ఇప్పటికే 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేసే వర్కర్లు, ఆయాలకు కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో చెల్లించాల్సిన బిల్లులు బకాయిలున్నాయి. వేతనాలు రెగ్యులర్‌గా రావడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ ఒక నెల వేతనం బకాయి ఉండగా, జిల్లావ్యాప్తంగా 800 మంది వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు నాలుగైదు నెలల వేతనాలు వారి వేతన ఖాతాలకు జమ కాలేదు. ఇందుకు సాంకేతిక అవరోధాలే కారణమని పై అధికారులు చెబుతున్నట్లు అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల సంఘం నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా గ్యాస్‌ బిల్లు, అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బిల్లులు, కాయగూరల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ రూపేణా కార్యకర్తలు, ఆయాలకు రూ.7.92 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు యూనియన్‌ నేతలు చెబుతున్నారు. అలాగే గత రెండేళ్లుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు రవాణా భత్యం చెల్లించడం లేదు. రవాణా ఖర్చులుగా సుమారు రూ.6.65 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు గతంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. 

టార్గెట్ల పేరుతో ‘ఉపాధి’ సిబ్బందికి వేధింపులు
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ల పేరుతో వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనులు వెదకడం, జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఉపాధి కల్పించడం ఫీల్డ్‌ అసిస్టెంట్ల విధి. ఏడాదిలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పరిధిలో ఉన్న కూలీలకు 7,500 పనిదినాలు కల్పించక పోతేను జూనియర్‌ మేట్‌గా డిమోట్‌ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విధంగా జిల్లాలో 2017–18లో 115 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు జూనియర్‌ మేట్లుగా మారగా, అంతకు ముందు సంవత్సరం మరో 120 మంది ఈ విధంగా డిమోట్‌ అయ్యారు. జిల్లాలో 956 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లలో 701 మందికి మాత్రమే ఎఫ్‌టీఏకు అర్హత సాధించారు. టార్గెట్‌ చేరుకోలేదని కారణంతో 255 మందికి ఎఫ్‌టీఏ ఇవ్వలేదు. అయితే తమను రెగ్యులర్‌ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన చేసినా ఫలితం కానరాలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top