అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు.
అంగన్వాడీలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి
Feb 12 2014 1:13 AM | Updated on Jun 2 2018 8:29 PM
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్లైన్ :అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు పెన్షన్తో సహా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అమృతహస్తం పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని, పెంచిన అద్దెలను షరతుల్లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ధరల పెరుగదలకు అనుగుణంగా మెను ఛార్జీలు పెంచాలన్నారు. వంటలకు సరిపడా గ్యాస్ను సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం పోరాటాలు తప్పవన్నారు. నిరవధిక నిరాహార దీక్షలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగబ్రహ్మాచారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు టి.జ్యోతిరాణి, సిహెచ్ లలితకుమారి, సిహెచ్ సుబ్బలక్ష్మీ, కె.కుమారి, రాధ, పి.శాంతమణి, నాగమల్లేశ్వరమ్మ, కె.పద్మ, ఎన్.శాంతకుమారి, ఎం.శివలక్ష్మి, డి.కోటేశ్వరమ్మ కూర్చున్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ, సిఐటియు నాయకులు రాంబాబు, బైరగాని శ్రీనివాసరావు తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు.
Advertisement
Advertisement