‘ఇకపై ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లే’ | Andhra Pradesh Government To Run 500 Liquor Shops From September 1st | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపులను సమూలంగా నిర్మూలించాం : ఎంఎం నాయక్‌

Aug 29 2019 7:16 PM | Updated on Aug 29 2019 7:29 PM

Andhra Pradesh Government To Run 500 Liquor Shops From September 1st - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్‌ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ వెల్లడించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్‌ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్‌ 1నుంచి ఆగస్ట్‌ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు.

మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్‌ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్‌ రూమ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement