లంబసింగిలో అల్లూరి పార్కు | Sakshi
Sakshi News home page

లంబసింగిలో అల్లూరి పార్కు

Published Mon, May 7 2018 1:11 PM

Alluri Park in Lambasingi - Sakshi

చింతపల్లి(పాడేరు): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో అల్లూరి సీతారామరాజు పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్‌ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తెలిపా రు. ఆదివారం ఆయన లంబసింగి ప్రాంతంలో పర్యటించి పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. పర్యాటకంగా లంబసింగిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

30 ఎకరాల్లో అల్లూరి సీతారామరాజు పార్కును నిర్మిస్తామన్నారు. ఇందుకు అవసరమైన స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను  ఆదేశించారు. పార్కులో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శీతాకాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పర్యాటలకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, సౌకర్యాలు కల్పిస్తే వేసవి విడిదిగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. 

పర్యాటకంగా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన నిధులు, చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి కాఫీ సాగుచేస్తున్న గిరిజన రైతులతో మాట్లాడారు. కాఫీకి ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరలు సద్వినియోగం చేసుకోవాలని   సూచించారు.

కాఫీ రైతులకు ఐటీడీఏ అందిస్తున్న సహాకారంపై గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు వ్యవసాయపరంగా వివిధ రకాల పంటల సాగుతో పాటు ఉద్యానవనశాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని లాభసాటి పంటలను చేపట్టాలన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్‌ సాగు విజయవంతమైతే గిరిజనులు కాఫీతో పాటు యాపిల్‌ను సాగు చేసుకోవచ్చన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో ప్రేమాకర్,గిరిజన సంక్షేమ శాఖ డీఈఈ రాజు, సర్పంచ్‌ కొర్రా రఘునాథ్‌ పాల్గొన్నారు.   

Advertisement
Advertisement