మెక్సికోకు చెందిన గాబ్రియెల్ అనే యువతి.. ఢిల్లీలో కనిపించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పగటిపూట ఎండలు భారీగా ఉండటం వల్ల దేశరాజధానిలో అర్ధరాత్రి సమయంలో పార్కుల్లో కుటుంబాలతో కలిసి ప్రజలు ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది.
మెక్సికోలో రాత్రి వేళల్లో కుటుంబాలు బయటకు వచ్చి పార్కుల్లో గడపడం చాలా అరుదు అని గాబ్రియెల్ వీడియోలో వెల్లడించింది. కానీ.. ఢిల్లీలో రాత్రి వేళల్లో కూడా పార్కులు జనంతో కిక్కిరిసిపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ యువత మాత్రమే కాకుండా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం కుటుంబాలు కనిపించాయని ఆమె చెప్పింది.
ఈ విషయంపై గాబ్రియెల్ భర్త గౌరవ్ వివరిస్తూ.. ఢిల్లీలో వేసవికాలంలో పగటి వేళల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రజలు రాత్రి సమయంలోనే బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో సమయం గడపడం సాధారణ విషయమని వివరించాడు. ఈ సంస్కృతి తనకు కొత్తగా అనిపించిందని గాబ్రియెల్ పేర్కొంది.
వృత్తిరీత్యా గాబ్రియెల్ ఒక సైకాలజిస్ట్.. అయితే ఈమె సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు పొందింది. కాగా ఈమెకు భారతీయుల జీవనశైలి, కుటుంబ విలువలు, సామాజిక బంధాలు అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.


