
అటకెక్కిన ఒప్పందం
శేషాచల అడవుల్లో ఇనుప ఖనిజ నిక్షేపాల వెలికితీత ఒప్పందం ఆటకెక్కింది. రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలోనూ, పుల్లంపేట మండల పరిధిలోకి వచ్చే తుమ్మలబైలు ప్రాంతంలో ఇనుపఖనిజం నిక్షేపాలున్నట్లు ఖనిజాభివృద్ధి సంస్ధ గతంలోనే గుర్తించింది.
రాజంపేట: శేషాచల అడవుల్లో ఇనుప ఖనిజ నిక్షేపాల వెలికితీత ఒప్పందం ఆటకెక్కింది. రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలోనూ, పుల్లంపేట మండల పరిధిలోకి వచ్చే తుమ్మలబైలు ప్రాంతంలో ఇనుపఖనిజం నిక్షేపాలున్నట్లు ఖనిజాభివృద్ధి సంస్ధ గతంలోనే గుర్తించింది.
అటవీ ప్రాంతం అంతర్భాగంలో ఆవిరించి ఉన్న ఖనిజనిక్షేపాలను వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పుల్లంపేట ప్రాంతంలో ఖనిజాభివృద్ధికి తోడ్పడే పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు అప్పటి కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి సాయిప్రతాప్ 2009లో ప్రకటించారు. రెండు ప్రాంతాల్లో ఇనుపఖనిజ నిక్షేపాలు వంద మిలియన్ల టన్నుల కంటే ఎక్కువుగా ఉంటే ఎన్ఎండీసీ ఇనుప కర్మాగారం పెట్టే అవకాశాలను కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే.
యుపీఏ పాలనలో కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రిగా కొనసాగిన రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని భారీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకురాలేకపోయారు. జాతీయఖనిజాభివృద్ధి సంస్ధ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ఇనుపఖనిజ తవ్వకాలపై ఒప్పందం చేసుకున్నాయి.
అయితే ఇనుపఖనిజనిక్షేపాలు శేషాచల అటవీ ప్రాంతాల్లో ఉండటంతో అటవీశాఖ అనుమతులు లభించాల్సివుంది. పుల్లంపేట వత్తలూరు మల్లేంవారిపల్లె సమీపంలోని అటవీ పరిసర ప్రాంతంలో ఇనుపఖనిజం నిక్షేపం అయి ఉన్నట్లు సర్వేల ద్వారా వెల్లడవుతోంది. నేషనల్ మినరల్ డెవలప్మెంటు కార్పొరేషన్ సంస్ధ (ఎన్ఎండీసీ) శేషాచల అటవీ ప్రాంతంలో సర్వే చేపట్టింది. తుమ్మలబైలు అటవీప్రాంతంలో దాదారు రెండువేల నుంచి మూడువేల ఎకరాల్లో మేలైన ఇనుపఖనిజం ఉన్నట్లు భూగర్భగనులశాఖ అధికారులు సర్వే చేశారు. చివరకు వెలికితీతకు చేసుకున్న ఒప్పందాన్ని పాలకులు అటకెక్కించారు.
నాలుగు దశాబ్ధాల కిందటే..
1960 ప్రాంతంలో ఇనుపరాయికి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, మార్కెట్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ప్రాంతం నుంచి రాయిని వెలికి తీసేందుకు ఎవరూ ముందుకురాలేదని సమాచారం. ఇక్కడ లభ్యం అయ్యే ఖనిజం మంచి గ్రేడ్ కలిగి ఉన్నదేనన్న అంశం సర్వేలో వెల్లడైంది. ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇక్కడ కూడా ఓ మారు సర్వే నిర్వహించారు. ఈ రెండుచోట్ల లభించే ఇనుపఖనిజ నిక్షేపాలను ఆధారం చేసుకుని ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కేంద్రస్ధాయిలో ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ ప్రాంతంలో వెయ్యి ఎకరాల స్థలం కోసం రెవెన్యూవర్గాలు అన్వేషించిన సంగతి విదితమే. ఇనుపఖనిజం వెలికితీత ఒప్పందం అటకెక్కడంతో రెండు మండలాలు మరింతగా పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు వీలుపడుతుంద న్న ఆశలు ఆవిరైపోతున్నాయి.